ENG vs IND : లార్డ్స్లో 45 నిమిషాల పాటు జస్ప్రీత్ బుమ్రా.. ఇంగ్లాండ్కు చుక్కలే..
జూలై 10 నుంచి లండన్లోని లార్డ్స్ వేదికగా జరగనున్నమూడో టెస్టు మ్యాచ్లో బుమ్రా ఆడనున్నాడు.

Team India pacer Jasprit Bumrah practice hard in Lords
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతోంది. మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవగా, రెండో మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దీంతో ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇక వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్కు టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు.
జూలై 10 నుంచి లండన్లోని లార్డ్స్ వేదికగా జరగనున్నమూడో టెస్టు మ్యాచ్లో బుమ్రా ఆడనున్నాడు. ఈ విషయాన్ని రెండో టెస్టు ముగిసిన తరువాత స్వయంగా కెప్టెన్ గిల్ చెప్పేశాడు. ఈ క్రమంలో బుమ్రా మూడో టెస్టు కోసం సిద్ధం అవుతున్నాడు.
మంగళవారం లార్డ్స్ మైదానంలో దాదాపు 45 నిమిషాల పాటు బౌలింగ్ చేశాడు. ఆ తరువాత తన బ్యాటింగ్ పై దృష్టి పెట్టాడు. ఎడమచేతి వాటం స్పిన్, త్రోడౌన్లను ఎదుర్కొంటూ బ్యాటింగ్ సాధన చేశాడు.
బుమ్రా స్థానంలో రెండో టెస్టులో ఆడిన ఆకాశ్ దీప్ 10 వికెట్లతో చక్కని ప్రదర్శన చేశాడు. దీంతో ప్రస్తుతానికి అతడిని తీయలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో బుమ్రా మూడో టెస్టులో ఆడొచ్చు. మరోవైపు టెస్టు అరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్న ఎడమచేతి వాటం పేసర్ అర్ష్దీప్ సింగ్ సైతం నెట్స్లో చాలా సేపు శ్రమించాడు. దాదాపు గంట పాటు అతడు బౌలింగ్ సాధన చేశాడు.
అలాగే రీఎంట్రీలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని కరుణ్ నాయర్తో పాటు సాయి సుదర్శన్ కూడా ప్రాక్టీస్లో తీవ్రంగా శ్రమించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ఆకాశ్ దీప్, సిరాజ్లు ఈ సెషన్కు దూరంగా ఉన్నారు.