Champions Trophy 2025 points table : అగ్రస్థాన మురిపం ఒక్కరోజే.. మళ్లీ రెండో స్థానానికి పడిపోయిన భారత్.. రెండు మ్యాచ్లు గెలిచినా కూడా..
పాక్ పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న భారత్ ఒక్క రోజు మాత్రమే ఆ స్థానంలో కొనసాగింది.

Team India Second place in Champions Trophy 2025 points table after 2 wins
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్లపై విజయం సాధించి సెమీస్కు దూసుకువెళ్లిపోయింది. ఆదివారం దుబాయ్ వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాడో గెలిచింది. పాక్ పై గెలిచిన తరువాత గ్రూప్-ఏలో ఉన్న భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్రేట్ +0.647గా ఉంది.
అయితే.. పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానం ఒక్క రోజుకే పరిమితమైంది. సోమవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ సైతం ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలవగా ఆ జట్టు ఖాతాలో కూడా నాలుగు పాయింట్లే ఉన్నాయి. అయితే.. నెట్ రన్రేట్ (+0.863)అధికంగా ఉండడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కివీస్ దూసుకువెళ్లింది.
అగ్రస్థానంలో ఉంటే వచ్చే లాభమేంటి..?
గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. ఇదే గ్రూప్లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇంటిముఖం పట్టాయి. అటు గ్రూప్-బిలో ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిబంధనల ప్రకారం ప్రతి గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్కు చేరుకుంటాయి. ఈ క్రమంలో గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉన్న జట్టు గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో, అదే విధంగా గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు గ్రూప్-బిలో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో సెమీస్లో తలపడాల్సి ఉంది.
కాగా.. గ్రూప్-బి నుంచి ఇంకా సెమీస్ చేరుకునే జట్లు ఏవో ఇంకా ఖరారు కాలేదు. ఆడిన ఒక్క మ్యాచ్లో ఓడినప్పటికి ఇంగ్లాండ్ ను సైతం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఆ జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కాబట్టి.. దక్షిణాప్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లలో రెండు జట్లు సెమీస్కు చేరుకునే అవకాశం ఉంది.
అందువల్ల భారత జట్టు టేబుల్ టాపర్గా సెమీస్కు చేరుకుంటే గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. ఇది జరగాలంటే మార్చి 2 ఆదివారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు ఆరు పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది.