రెండో రోజూ మనమే: విండీస్ విలవిల

రెండో రోజూ మనమే: విండీస్ విలవిల

Updated On : August 24, 2019 / 2:13 AM IST

వెస్టిండీస్‌పై జరుగుతున్న టెస్టు పోరులో భారత్‌దే పై చేయిగా కొనసాగుతోంది. తొలి టెస్టు రెండో రోజు మ్యాచ్‌లోనూ భారత్ హవానే నడిచింది. తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలో టాపార్డర్ తడబడినప్పటికీ అజింక్య రహానె (81; 163 బంతుల్లో 10ఫోర్లు) పోరాడడంతో భారత్‌ కోలుకోవడంతో జడేజా (58; 112 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సు) ఇన్నింగ్స్‌‌కు చక్కటి ముగింపునిచ్చాడు. రెండో రోజు పంత్‌ (24), జడేజా ఇన్నింగ్స్‌ కొనసాగించగా.. కాసేపటికే పంత్‌ వెనుదిరిగాడు. కానీ విండీస్‌ పదునైన పేస్‌ను ఎదుర్కొంటూ జడేజా పట్టుదలగా నిలిచాడు. ఆశ్చర్యకరంగా ఇషాంత్‌ (19; 62 బంతుల్లో 1ఫోర్లు) కూడా రోచ్‌, గాబ్రియెల్‌లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ 297 పరుగులు చేసింది. 

మెరుగైన ఆరంభం లభించినప్పటికీ విండీస్‌ ఇన్నింగ్స్‌ సరిగ్గా సాగలేదు. బ్రాత్‌వైట్‌తో ఓపెనింగ్‌కు దిగిన క్యాంప్‌బెల్‌(23; 30బంతుల్లో 4ఫోర్లు) చక్కటి షాట్లతో మెరిశాడు. ఎనిమిదో ఓవర్‌లో షమి బౌలింగ్‌కి బౌల్డ్‌గా వెనుదిరిగాడు. కుదురుకున్నట్లే కనిపించినా బ్రాత్‌వైట్‌(14)ను ఇషాంత్‌ బోల్తా కొట్టించాడు. బ్రూక్స్(11) కూడా జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో రహానె చేతికి చిక్కడంతో 3వ వికెట్ 10కి మించిన స్కోరుతో పెవిలియన్ బాట పట్టింది. 

విండీస్‌ తరఫున క్రీజులో నిలబడే ప్రయత్నం చేస్తున్న షై హోప్‌, హెట్‌మైయర్‌ జోడీకి లంబూ బ్రేక్ లు వేశాడు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తక్కువ పరుగుల వ్యవధిలో ఔట్‌ చేశాడు. 54వ ఓవర్‌ ఆఖరి బంతికి షై హోప్‌(24; 65బంతుల్లో 1ఫోర్), 56వ ఓవర్‌లో మూడో బంతికి హెట్‌మైయర్‌(35; 47బంతుల్లో 3ఫోర్లు), ఆఖరి బంతికి రోచ్‌(0)లను వెంటవెంటనే ఔట్‌ చేసి విండీస్‌ ఆశలను చిదిమేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో కెప్టెన్‌ హోల్డర్‌(10), కమిన్స్ ఉన్నారు.