దుబ్బాక ఉపఎన్నికలో ఎవరు గెలిచినా ఒక్కటే.. ఎందుకంటే..

dubbaka bypolls: దుబ్బాక ఉప ఎన్నికలను పార్టీలన్నీ చాలా ప్రిస్టేజ్గా తీసుకుంటున్నాయి. ఎట్టాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్లాన్లు వేస్తున్నాయి. సిటింగ్ స్థానం కావడంతో ఎలాగైనా నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రైటింగ్ చేస్తుంటే.. టీఆర్ఎస్ను ఓడించి.. ప్రభుత్వం మీద జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని చాటి చెప్పాలని అపొజిషన్ పార్టీలు కష్టపడుతున్నాయి. అయితే ఎవరు గెలిచినా ఒకటే అంటున్నారు జనాలు. అందరూ ఆ తానులో ముక్కలేనని చెబుతున్నారు. అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా అని అంటే.. అందరి వెనుకా ఉన్నది ఒకటే పార్టీ కదా అని అభిప్రాయపడుతున్నారు.
అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తున్న వారు టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ నేతలు:
దుబ్బాక సిటింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. టీఆర్ఎస్ తరఫున రామలింగారెడ్డి సతీమణి సుజాత రంగంలోకి దిగుతున్నారు కాబట్టి ఆమెది అధికారికంగా టీఆర్ఎస్ పార్టీయే. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్రెడ్డి కూడా టీఆర్ఎస్ నుంచే వచ్చి కాంగ్రెస్ టికెట్ దక్కించుకొన్నారు. దీని కంటే ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల విజయం కోసం కృష్టి చేస్తున్న ముఖ్య నేతలు కూడా టీఆర్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారేనని చెబుతున్నారు.
అంతా కారులో ప్రయాణించిన వారే:
టీఆర్ఎస్ తరఫున ఇక్కడ బాధ్యతలు మోస్తున్న హరీశ్రావు ఎలాగో అఫీషియల్ టీఆర్ఎస్ నాయకుడే. కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ బాధ్యతలు మోస్తున్న జగ్గారెడ్డి గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్తో సంబంధం ఉన్నవారేనని అంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న రఘునందన్రావు కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే. గతంలో మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుత ఉప ఎన్నికలో ఆయన గెలుపు కోసం దుబ్బాకలో మాజీ ఎంపీ జితేందర్రెడ్డి బీజేపీ తరఫున కృషి చేస్తున్నారు. జితేందర్రెడ్డి కూడా గతంలో టీఆర్ఎస్ ఎంపీగా పని చేసిన వారే. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. కాబట్టి ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా టీఆర్ఎస్ పార్టీయేనని చెబుతున్నారు.
పోటాపోటీగా దుబ్బాక ఉప ఎన్నిక:
మూడు ప్రధాన పార్టీల గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న నేతలంతా టీఆర్ఎస్తో సంబంధం ఉన్న వారే కావడంతో దుబ్బాక ఉపఎన్నిక పోటా పోటీగా సాగడం తథ్యమని అంటున్నారు. ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ నేతలంతా ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీలు అటు ఇటు మారిన నేతలంతా ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున బాధ్యతలు తీసుకున్నారు. ఆయా అభ్యర్థుల గెలుపు కోసం కిందా మీదా పడుతున్నారని అంటున్నారు. ఈ లెక్కలన్నీ వేసిన జనాలు.. ఎవరు గెలిచినా.. వారిని గెలిపించడానికి ట్రై చేసిన నేతలు మాత్రం టీఆర్ఎస్ వారేనని చెబుతున్నారు.