Bandi Sanjay : తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదు .. కేంద్రం బలగాలు కావాలి
కేంద్రానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణ పోలీసులపై తనకు నమ్మకం లేదని .. తనకు భద్రతగా కేంద్ర బలగాలు కావాలని లేఖలో కోరారు.

Bandi Sanjay's letter to Central Govt
Bandi Sanjay’s letter to Central Govt : పాదయాత్రలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు పిలుపు ఇచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని జనగామ నుంచి కరీంనగర్ తరలించి ఆయన ఇంటిలో వదిలిపెట్టారు. దీంతో పోలీసుల తీరుపై బండి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.అరెస్ట్ లతో నా పాదయాత్రను ఆపలేరని..నా యాత్రను కొనసాగిస్తాను అంటూ స్పష్టం చేశారు.
తనను అదుపులోకి తీసుకున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో కేంద్రానికి బండి సంజయ్ లేఖ రాశారు.తెలంగాణ పోలీసులపై తనకు నమ్మకం లేదని..తన పాదయాత్రకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరుతూ.. లేఖలో కోరారు. దీంతో కేంద్రం స్పందించి ఈరోజు సాయంత్రానికిగానీ రేపు ఉదయానికి గానీ కేంద్ర బలగాలు పాదయాత్ర ప్రాంతానికి చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది.
కాగా..ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వచ్చిన క్రమంలో బీజేపీ కార్యకర్తలు కవిత నివాసం ముందు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ బండి సంజయ్ జనగామలోని పామ్నూరులో పాదయాత్రలో ఉండగానే పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మదీక్షకు పిలుపునిచ్చారు.
బండి సంజయ్ కూడా పాదయాత్ర శిబిరం వద్ద నల్ల బ్యాడ్స్ ధరించి దీక్ష చేపట్టే యత్నంచేస్తుండగా పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేయటానికి వచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయినా పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో బండి సంజయ్ తనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని తన పాదయాత్రకు భద్రతగా కేంద్ర బలగాలు కావాలని లేఖ రాశారు.