Bhatti Vikramarka: ఆర్నెళ్లు ఓపిక పట్టండి.. ఆ తరువాత వాళ్ల సంగతి చూద్దాం..
ఆరు నెలలు మీ భూములను మీరు కాపాడుకుంటే ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మీ భూములు కాపాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా వుంటుందని భట్టి ప్రజలకు సూచించారు.

Bhatti vikramarka
Bhatti Vikramarka: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో స్కాంలు, దోపిడీలు తప్ప.. సాధించిన అభివృద్ధి శూన్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను వెనక్కి తీసుకొని అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములపై బీఆర్ఎస్ నేతలకు అమ్ముకోవడానికి హక్కు ఎవరు ఇచ్చారంటూ భట్టి ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేదలు రోడ్డున పడుతున్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఉసురు కచ్చితంగా తాకుతుందని, పేదల భూములు అమ్ముకుంటూ పోతే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్న వారిపై తిరుగుబాటు చేయడానికి చాకలి ఐలమ్మ మాదిరిగా పోరాటం చేస్తామని అన్నారు.
ఆరు నెలలు మీ భూములను మీరు కాపాడుకుంటే ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మీ భూములు కాపాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా వుంటుందని భట్టి ప్రజలకు సూచించారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపట్టిన బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఒక ప్రాజెక్ట్ మొదలుపెడితే ఇంతవరకు ఒక మోటర్ ఆన్ చేయలేదని విమర్శించారు.
Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. రేపు ప్రమాణ స్వీకారం.. వాటివల్లే డీకేకు దూరమైన సీఎం చైర్
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో స్కామ్, దోపిడీ మాత్రమే సాధించిందని, రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యంమని ఆరోపించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలో రాష్ట్రానికి మంచిపేరు తెస్తుందని ప్రజలు భావిస్తే.. లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీ స్థాయిలో పేరుపొందిందని భట్టి విమర్శించారు.