బీఆర్ఎస్‌ అధిష్ఠానం రూట్ మార్చిందా? కేసీఆర్‌ ఇప్పటినుంచే ఎన్నికలకు రెడీ అవుతున్నారా? అందుకే ఇలా..

పరిస్థితులను బట్టి వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట, ఆలంపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేకపోతే నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయొచ్చని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కేటీఆర్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్‌ అధిష్ఠానం రూట్ మార్చిందా? కేసీఆర్‌ ఇప్పటినుంచే ఎన్నికలకు రెడీ అవుతున్నారా? అందుకే ఇలా..

KCR brs

Updated On : August 23, 2025 / 9:57 PM IST

BRS: మొహమాటాలు లేవు. లాబీయింగ్‌లకు చోటేలేదు. ఎవరు గెలుస్తారనుకుంటే వాళ్లకే టికెట్. సరైన అభ్యర్థులు లేని చోట ఆకర్ష్‌తో జాయినింగ్స్‌. అవసరమైతే పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలను కూడా తిరిగి తీసుకోవాలని డిసైడ్ అయిందట బీఆర్ఎస్ పార్టీ.

ఈ సారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని..గత ఎన్నికల్లో చేసిన మిస్టేక్స్‌తో మళ్లీ చేయొద్దని భావిస్తోందట. 2023 ఎన్నికల్లో 30, 35 మంది అభ్యర్థులను మారిస్తే బీఆర్ఎస్ మళ్లీ పవర్‌లోకి రావడం ఖాయమని సర్వేలు చెప్పినా..గులాబీ బాస్ కేసీఆర్ సిట్టింగులకే సీట్లు ఇవ్వడం వల్ల ఓడిపోయిందన్న చర్చ ఉంది.

దాంతో ఇప్పుడా మిస్టేక్‌ చేయొద్దని భావిస్తున్నారట. ఈ క్రమంలో ప్రతీ నియోజకవర్గంలో బలమైన నేతనే అభ్యర్థిగా ఫిక్స్ చేయాలని..స్ట్రాంగ్ లీడర్‌ లేని చోట ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవాలని అనుకుంటున్నారట.

మాజీ ఎమ్మెల్యేలను కూడా తిరిగి చేర్చుకునే యోచన

బలమైన నేతలుగా ఉండి..కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను కూడా తిరిగి చేర్చుకునే యోచనలో ఉన్నారట. ఈ క్రమంలోనే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేరికకు గులాబీ కేసీఆర్ ఓకే చెప్పారట.

Also Read: Kadapa: ఆ ముగ్గురిలో కడపకు “సైకిల్” బాస్ అయ్యేదెవరు? హైకమాండ్ ప్లాన్ ఏంటి? 

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కోనప్ప. అదే నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగారు. దీంతో కోనప్ప 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలవడం వల్లే తన ఓట్లు చీలి ఓడిపోయానని కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరడంతో కోనప్ప అలిగి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలోనూ తిరుగుబాటు బావుటా  

కానీ కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలోనూ ఆయన తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. ముఖ్యమంత్రి బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు.

కానీ ఆ తర్వాత కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

కోనప్ప కొద్దికాలంగా సొంతంగానే కార్యక్రమాలు

సీఎం హామీ ఇచ్చినా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ముందడుగు పడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన కోనేరు కోనప్ప ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

కోనప్ప కొద్దికాలంగా సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో తిరిగి ఆయన బీఆర్ఎస్‌లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే కోనేరు కోనప్ప చేరికకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోనప్ప చేరిక కోసం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, జోగు రామన్న, జగదీశ్ రెడ్డి మధ్యవర్తిత్వం నడిపినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌లో చేరికకు ముహుర్తం ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

కోనేరు కోనప్ప బీఆర్ఎస్‌లో చేరితే ఆర్ఎస్ ప్రవీణ్ పరిస్థితి

అయితే గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే సిర్పూర్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఇటువంటి సమయంలో కోనేరు కోనప్ప బీఆర్ఎస్‌లో చేరితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. సేమ్‌టైమ్‌ రెండ్రోజుల క్రితమే ఆర్‌ఎస్పీ చేసిన కామెంట్స్‌ వైరల్ అవుతున్నాయి. (BRS)

సిర్పూర్‌ ప్రజల వెంటే ఉంటా..అక్కడి నుంచే పోటీ చేస్తా..ఇదిగో నా ఇంటి నెంబర్‌ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి.

మరోవైపు కోనేరు కోనప్ప మాత్రం తాను బీఆర్ఎస్‌ నుంచే పోటీ చేస్తానంటున్నారట. లేకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా గానీ..కాంగ్రెస్ బీఫామ్‌ మీద అయితే పోటీ చేయనంటున్నారట.

ఆయన 2014లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ కూడా సిర్పూర్‌ నుంచే పోటీ చేస్తానంటున్నారు.

ఇటీవలే గువ్వల బాలరాజు రాజీనామా

ఈ నేపథ్యంలో ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్‌తో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే గువ్వల బాలరాజు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన అచ్చంపేట నియోజవర్గాన్ని చూసుకోవాలని ఆయనకు చెప్పినట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

పరిస్థితులను బట్టి వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట, ఆలంపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేకపోతే నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయొచ్చని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కేటీఆర్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో ప్రవీణ్ కుమార్‌తో సమన్వయం చేసుకోవాలని కోనప్పకు కూడా గులాబీ బాస్‌ కేసీఆర్ సూచించినట్లు సమాచారం.

మరి కోనప్ప చేరిక కన్ఫామ్ అయిందా.? ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ సర్దుకుపోతారా అనేదివేచి చూడాలి.