KTR : ఏ విచారణకైనా సిద్ధం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి .. మాపై కోపంతో రాష్ట్రాన్ని ఆగంచేయొద్దు

. కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నాం. మాపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దు అంటూ కాంగ్రెస్ కు కేటీఆర్ సూచించారు.

KTR : ఏ విచారణకైనా సిద్ధం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి .. మాపై కోపంతో రాష్ట్రాన్ని ఆగంచేయొద్దు

BRS MLA KTR

Updated On : December 24, 2023 / 1:29 PM IST

BRS Sweda Patram : బీఆర్ఎస్ పార్టీ తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ప్రగతి ప్రస్థానాన్ని ‘స్వేదపత్రం’ పేరుతో ఆదివారం విడుదల చేసింది. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్వేదపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన అవసరం మాపై ఉందని కేటీఆర్ అన్నారు. శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పిన అప్పుల లెక్కల గురించి కేటీఆర్ మాట్లాడారు.. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు పాత అప్పులు రూ. 72,658 కోట్లు.. తెలంగాణ అప్పులు రూ. 3.17 లక్షల కోట్లు. కానీ, రూ. 6.71 లక్షల కోట్ల అప్పు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందని, ఇదంతా తప్పుల తడక అని కేటీఆర్ విమర్శించారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1.14లక్షలు. 2023లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3.17లక్షలు. 2013లో తెలంగాణ పేదరికం 21శాతం.. 2023లో పేదరికం 5శాతంకు తగ్గిందని అన్నారు. 2013 -14లో జీఎస్ డీపీ రూ. 4.51లక్షల కోట్లు. 2022 -2023 నాటికి జీఎస్డీపీ రూ. 13.22 లక్షల కోట్లకు పెంచామని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయని కేటీఆర్ అన్నారు.

Also Read : BRS Sweda Patram : బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల.. పదేళ్ల పాలనపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

సివిల్ సప్లయ్ లో రూ. 56వేల కోట్ల అప్పు ఉందని చెప్పారు.. అందులో రూ. 30వేల కోట్ల విలువైన ధాన్యం నిల్వలున్నాయి, ఎఫ్ సీఐ నుంచి రూ. 16వేల కోట్లు రావాల్సి ఉందని కేటీఆర్ అన్నారు. ఆర్బీఐ నివేదికలనే మేం ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు. 126 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎలా వెల కడతారని కేటీఆర్ ప్రశ్నించారు. అదేవిధంగా విద్యుత్ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించామని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2,700 మెగావాట్ల లోటు ఉంది. అంచెలంచెలుగా విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాం. 2013-14 నాటికి 7,778 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంది.. 2022- 23 నాటికి 19,464 మెగావాట్ల సామర్థ్యం సాధించామని కేటీఆర్ చెప్పారు. విద్యుత్ రంగంలో మేం సృష్టించిన ఆస్తులు విలువ రూ. 6,87,585 కోట్లు. విద్యుత్ రంగంలో మేం పెట్టిన ఖర్చు రూ. 1,37,517 కోట్లు అని కేటీఆర్ అన్నారు.

Also Read : AP Assembly Elections 2024: నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలపై కత్తిరింపుల కత్తి

సాగునీటి రంగానికి మేం పెట్టిన ఖర్చు రూ. 1,76,000కోట్లు. కొత్తగా 60లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయకట్టు స్థిరీకరణ చేశాం. 204 టీఎంసీల రిజర్వాయర్లను ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క బరాజ్ లో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పుబడుతున్నారని అన్నారు. న్యాయ విచారణ చేయిస్తామంటున్నారు.. బరాబర్ చేయించుకోండి అంటూ కేటీఆర్ అన్నారు. ఏ విచారణకైనా సిద్ధం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి. కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నాం. మాపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దు అంటూ కాంగ్రెస్ కు కేటీఆర్ సూచించారు.