హై సెక్యూరిటీ అలర్ట్ : హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఈ 5 రోడ్లు మూసివేత

జంటనగరాల్లోని ఐదు ప్రధాన రహదారులను సెప్టెంబర్ 30వరకూ క్లోజ్ చేయనున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ తెలియజేసింది. సికింద్రాబాద్లో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ నాలుగు రోజుల పాటు అంటే గురువారం ఉదయం 10గంటల నుంచి మూసివేయనున్నామని ప్రకటించింది. డిఫెన్స్ అధికారులు హై సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించడంతో బొల్లారంతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లు బ్లాక్ అవనున్నాయి.
కేంద్రీయ విద్యాలయకు దగ్గరల్లో ఉన్న యప్రాల్ రోడ్, ట్రినిటీ చర్చ్కు దగ్గర్లో ఉన్న రాజేంద్ర సింగ్జీ రోడ్, బాలాక్లావా రోడ్లోని బిషన్ గేట్ మూసేస్తున్నారు. అంతేకాకుండా ఆర్మీ అధికారులు గాట్ రోడ్, వెల్లింగటన్ రోడ్, అలహాబాద్ గేట్ ప్రాంతాల్లో రాత్రి ప్రాంతాల్లో సంచరించే వీలు లేకుండా నిషేదాన్ని విధించారు.
అయితే ఈ నియమాలను ఉన్నట్టుండి అమలు చేయడంతో రోడ్లపై వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది. మార్నింగ్ వాకర్స్ నుంచి వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యప్రాల్కు చెందిన శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికి ఇదే విషయంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. యప్రాల్లోని మరో వైపుకు వెళ్లేందుకు ఆర్మీగేట్ మీదుగా వెళ్తున్నాడు. బాలాజీ నగర్లోని హనుమాన్ టెంపుల్ సమీపంలో వెహికల్ అడ్డుకున్నారు ఆర్మీ సైనికులు.
ఆ సమయంలో అతణ్ని ఐడీ ప్రూఫ్ అడిగారు. ఆ డ్యాక్యుమెంట్లను చూపించడంతో అవి తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వలేదు. దీంతో వీడియో రికార్డింగ్ మొదలుపెట్టి తన డ్యాక్యుమెంట్లను ఇవ్వాలని అడిగాడు. సైనికులు డ్యాక్యుమెంట్లను కొద్ది నిమిషాల తర్వాత పై అధికారికి చూపించి తిరిగి ఇచ్చేశారు. డ్యాక్యుమెంట్లు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేద్దామనుకున్నానని శ్రావణ్ కుమార్ తెలిపాడు.