CM Kcr Warning : వడ్లను తీసుకోవాల్సిందే..లేకపోతే బీజేపీ ఆఫీసుపై కుమ్మరిస్తాం – సీఎం కేసీఆర్ హెచ్చరిక
కొనుగోలు చేయకపోతే..ఆ ధాన్యాన్నే బీజేపీ కార్యాలయాలపై పోస్తామని హెచ్చరించారు. చివరి రక్తపుబొట్టు దాక రైతుల కోసం పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.
Paddy Issue In Telangana : వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. 2021, నవంబర్ 18వ తేదీ గురువారం వరి కొనుగోళ్లపై కేంద్రంతో సమరానికి సై అంటూ టీఆర్ఎస్ చేపట్టిన మహా ధర్నా ఇందిరాపార్క్ లో కొనసాగింది. ఈ ధర్నాకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడారు. కొనుగోలు చేయకపోతే..ఆ ధాన్యాన్నే బీజేపీ కార్యాలయాలపై పోస్తామని హెచ్చరించారు. చివరి రక్తపుబొట్టు దాక రైతుల కోసం పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. దమ్ముంటే..వర్షాకాలంలో వచ్చే వడ్లు కొంటరో, లేదో చెప్పాలని మరోసారి ప్రశ్నించారు. ఒకేసారి పంట మార్చడం కష్టమేనని, కానీ, పంట వేసి నష్టపోవడం కన్నా వేయకపోవడమే మంచిదని సూచించారు.
Read More : CM KCR : తెలంగాణ పండించే వడ్లను కొంటరా ? కొనరా ? సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న
కేంద్రం మాట విని తాము వడ్లు వద్దంటే…ఇక్కడి బీజేపీ నేతలు వరి వేయమంటున్నారని, వడ్లు వేయాలి, రోడ్ల మీద పోయాలి..దాని మీద రాజకీయం చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ఇంకా 5 లక్షల టన్నుల వడ్లు అలాగే ఉన్నాయని, వడ్లను కేంద్రం తీసుకోకపోతే..బీజేపీ ఆఫీసుపై కుమ్మరిస్తామని మరోసారి హెచ్చరించారు. రాష్ట్రాల మధ్య తగాదా పెట్టి..నీళ్లివ్వకుండా..రైతాంగాన్ని అల్లాడిస్తున్నారని విమర్శించారు.
హంగర్ ఇండెక్స్ లో భారత్ ఆకలి రాజ్యం అని తెలుస్తోందని, సమస్య ఉన్నదంతా కేంద్రం వద్దే ఉందని..కేంద్రం మీద యుద్ధం ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఉత్తర భారత రైతాంగం కేంద్రానికి నిరసన వ్యక్తం చేస్తోందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారని, వడ్లు వేయాలి.. మెడలు వంచి కొనిపిస్తాం అని బీజేపీ నేతలు అంటున్నారని గుర్తు చేశారు. బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో బీజేపీ వితండవాదాలు సృష్టిస్తోందని తెలిపారు.
Read More : Maha Dharna TRS : కేంద్రంతో సమరానికి సై, ఆరంభం…మాత్రమే..అంతం కాదు – సీఎం కేసీఆర్
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ. ఇందిరాపార్క్ వేదికగా మహా ధర్నా జరిపింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, సహకార బ్యాంక్ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు మహా ధర్నా ప్రారంభమై… మధ్యాహ్నం రెండు గంటలదాకా ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి రాజ్భవన్కు వెళ్లి.. అక్కడ గవర్నర్ను కలిసి మెమొరాండం సమర్పించారు. మహా ధర్నా తర్వాత కేంద్రం నుంచి స్పందన కోసం రెండ్రోజులు ఎదురు చూస్తామని.. అప్పటికీ కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేకపోతే బీజేపీని వెంటాడుతూనే ఉంటామని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.