Delimitation: వాళ్లలా మోదీ డీలిమిటేషన్ చేయాలి.. ఈ పద్ధతి పాటిస్తే సరీ..: రేవంత్ రెడ్డి
మోదీ పాతికేళ్ల వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దని రేవంత్ రెడ్డి చెప్పారు.

CM Revanth Reddy
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్)పై ఇవాళ చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశం ద్వారా కేంద్రం దృష్టికి 3 పాయింట్లను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఇందిరాగాంధీ, వాజ్ పేయి చేసినట్టు నియోజకవర్గాలు పెంచకుండా డీలిమిటేషన్ చేయాలని అన్నారు. మోదీ కూడా వారిలాగే డీలిమిటేషన్ చేయాలని చెప్పారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కు దక్షిణాది ఒప్పుకోదని అన్నారు. ఒకవేళ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది పొలిటికల్ వాయిస్ కోల్పోతుందని చెప్పారు.
Also Read: ఆపిల్ ఐఫోన్ 17 ప్రో డిజైన్ అదరహో.. మరిన్ని డమ్మీ ఫొటోలు చూశారా?
ఉత్తరాది వారు దక్షిణాది వారిని సెకండరీ సిటిజన్ గా చూస్తారని, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలను డామినేట్ చేస్తాయని అన్నారు. దీన్ని దక్షిణాదిన అన్ని పార్టీలు ఏకమై అడ్డుకోవాలని చెప్పారు. ప్రో రేటా ఫార్ములా ప్రకారం కూడా నియోజకవర్గాల పునర్విభజనకు ఒప్పుకోబోమని అన్నారు.
అలాగే, మోదీ పాతికేళ్ల వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దని రేవంత్ రెడ్డి చెప్పారు. తాజా జనాభా గణాకాంల ఆధారంగా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని నియోజకవర్గాలను పునర్విభజించాలని అన్నారు.
మల్కాజ్ గిరి లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం నుంచి గతంలో తాను ప్రాతినిధ్యం వహించానని, అక్కడ జనాభా 45 లక్షలని, అలాంటి వాటిని మార్చాలని చెప్పారు. ఒకవేళ కేంద్రం డీలిమిటేషన్ చేస్తే.. ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ స్థానాల్లో దక్షిణాదికి 130 సీట్లు (24%) ఉన్నాయని, దీన్ని 33 శాతానికి పెంచాలని అన్నారు.