హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదు- సీఎం రేవంత్ వార్నింగ్

గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి.

హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదు- సీఎం రేవంత్ వార్నింగ్

Cm Revanth Reddy (Photo Credit : Facebook)

Cm Revanth Reddy : హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పని చేసే వారిని ప్రోత్సహిస్తామని, ఉన్నత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో సమీక్ష నిర్వహిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలన్నారు. కేవలం వర్షా కాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పని చేసేలా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలన్నారు. జూన్ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

”నాలాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దు. పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించాలి. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోండి. కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తా. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టండి. వాటికి బారికేడింగ్ ఉండేలా చర్యలు చేపట్టండి. గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి. కంటోన్మెంట్ ఏరియాలో నాలాల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టండి. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించండి. సమస్యాత్మక నాలాల వద్ద అవసరమైతే ప్రతీరోజు క్లీనింగ్ చేపట్టండి.

విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోండి. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి. పవర్ మేనేజ్ మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోండి. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదు. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. ఉన్నత స్థానం కల్పిస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.