Harish Rao : అసత్య సర్వేల పేరుతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ప్రచారం.. మూడోసారి బీఆర్ఎస్ విజయం ఖాయం: హరీష్ రావు
కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు. అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదని తెలిపారు.

Harish Rao Comments On Congress
Harish Rao – Congress Global Campaign : కాంగ్రెస్, బీజేపీపై మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. అసత్య సర్వేల పేరుతో అధికారంలోకి వస్తామని కాంగ్రెసోల్లు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు, కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఎక్కువ గల్లీలో తక్కువ, మాటలు, ముఠాలు, మూటలు, మంటలు కాంగ్రెస్ పార్టీ తీరుగా అభివర్ణించారు. మూడు గంటలు, మీటర్లు పెడతామంటున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు మంచివాళ్ళా? 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంచోడా? రైతులు ఆలోచించుకోవాలన్నారు.
Also Read : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ
కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు. అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదని తెలిపారు. 2004లో తెలంగాణ ఇస్తామని టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీని మింగేయాలని చూసిందన్నారు. హుస్నాబాద్ లోని కార్యకర్తలపై నమ్మకంతో సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారని అన్నారు.
హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ కలిసొచ్చిన నియోజకవర్గమని సీఎం కేసీఆర్ అన్నారని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ కు ఇచ్చిన గొప్ప వరంగా పేర్కొన్నారు. తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు తిండి లేని తెలంగాణ ఈ రోజు దక్షిణ భారత దేశ ధాన్య బండాగారంగా మారిందని కొనియాడారు.
Also Read: టీఎస్ఆర్టీసీ దసరా ధమాకా.. బస్సెక్కితే బహుమతులు
వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అయిందన్నారు. కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే తెలంగాణ కింద పడుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ 15న హుస్నాబాద్ లో జరుగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు 3 గంటలకు ప్రజలను తీసుకువస్తే, 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని తెలిపారు.