హైదరాబాద్ ఐటీసెక్టార్లో కరోనా కలకలం : మైండ్స్పేస్ ఉద్యోగికి పాజిటివ్ లక్షణాలు

హైదరాబాద్లో కరోనా కలకలం నెలకొంది. ఐటీ సెక్టార్ కరోనా భయాలు నెలకొన్నాయి. మైండ్స్పేస్లోని ఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి పాజిటివ్ లక్షణాలు వచ్చాయి. దీంతో కార్యాలయాన్ని యాజమాన్యం మూసేసింది. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇంటి నుంచే పని చేయాలంటూ ఉద్యోగులకు ఈ మెయిల్ పంపారు. మైండ్స్పేస్లోని ఇతర కార్యాలయాలను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
మరోవైపు కరోనా వైరస్ కేసు నేపథ్యంలో గాంధీ ఆస్పత్రికి అనుమానితుల తాకిడి పెరుగుతోంది. నిన్న 47 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 45 మందికి నెగెటివ్ అని తేలిందని ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేశారు. మరో ఇద్దరిపై అనుమానం ఉందని, వారి రక్త నమూనాల పరీక్షలను పుణె పంపామని, ఆ ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. వీరి టెస్టుల రిజల్స్ట్ రేపు వచ్చే అవకాశం ఉంది.
కరోనా వైరస్ బారిన పడ్డారని భావిస్తున్న ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఇటలీ నుంచి వచ్చిన వారు కాగా, మరొకరు.. కరోనా పాజిటివ్ కేసుగా గాంధీలో చికిత్స పొందుతున్న సాఫ్ట్వేర్ యువకుడికి సన్నిహితుడిగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందుకే వీరి రక్త నమూనాలను పుణెకు పంపినట్లుగా వైద్యులు తెలిపారు. మరోవైపు… కరోనా లేదని డిశ్చార్జి చేసిన 45 మందిని జనసంచారానికి దూరంగా హౌస్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు.
2020, మార్చి 04వ తేదీ బుధవారం మరో 23మంది కరోనా అనుమానితులు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. వీరి రక్తనమూనాలను కూడా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు… కరోనా అనుమానితులు గాంధీకి క్యూ కడుతుండటంతో సాధారణ పేషెంట్ల తాకిడి తగ్గింది. కరోనా అనుమానితుల తాకిడితో గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డు నిండిపోయింది. ఇక్కడి సామర్థ్యానికి మించి కరోనా కేసులు వస్తున్నాయి.
ఐసోలేషన్ వార్డులో 40 పడకలు మాత్రమే ఉండగా… 40గంటల వ్యవధిలో 50మందికిపైగా పరీక్షల కోసం వచ్చారు. దీంతో పడకల కొరత తలెత్తింది. ఇక.. గాంధీలోని ఐసోలేషన్ వార్డులో ఉన్న బెడ్స్ కెపాసిటీ ఫుల్ అవడంతో… కొత్తగా వచ్చే కరోనా అనుమానితులను ఫీవర్ ఆస్పత్రికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
* తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం.
* ఏపీ, తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు.
* కామారెడ్డి, తూర్పుగోదావరి జిల్లాల్లోను అనుమానితులు.
* కామారెడ్డి జిల్లా నుంచి గాంధీ ఆస్పత్రికి ఒకరి తరలింపు.
* తూర్పుగోదావరి జిల్లాలోని అనుమానితుడు కాకినాడకు తరలింపు.
* రెండ్రోజుల్లో 65మంది అనుమానితులకు గాంధీలో వైద్యపరీక్షలు.
* 29మందికి నెగెటివ్ రిపోర్ట్, 36మంది రిపోర్టుల కోసం వెయిటింగ్.
* రిపోర్టులురాని 36మందికి గాంధీ ఐసోలేషన్ వార్డులో చికిత్స.
* నిలకడగా కరోనా బాధితుడి ఆరోగ్యం.
* కరోనా బాధితుడు 88మందిని కలిసినట్లు అంచనా.
* 88మందిలో 45మందికి గాంధీలో వైద్య పరీక్షలు.
* కరోనా బాధితుడి కుటుంబీకులకు గాంధీలో చికిత్స.
* కరోనా పేషెంట్కు వైద్యం అందించిన డాక్టర్లోనూ వైరస్ లక్షణాలు?.
* పుణెకు గాంధీ డాక్టర్, మరో అనుమానితుడి రక్త నమూనాలు.
* 2020, మార్చి 05వ తేదీ గురువారం అందనున్న రిపోర్టులు.
See More :
కరోనా ఎఫెక్ట్ : లండన్లో చైనా యువకుడిపై దాడి
భారత్లో కరోనా విజృంభణ, 28 కేసులు నమోదు, రోగి నుంచి మరో ఆరుగురికి కరోనా