“హలో.. నేను హీరోయిన్ని మాట్లాడుతున్నాను” అంటూ సంభాషణలు.. ఆశపడి రూ.21 లక్షలు సమర్పించుకున్న యువకుడు.. చివరికి..
అమ్మాయిల పేరుతో చాటింగ్ చేసినా, మాట్లాడినా చాలా మంది యువకులు ఆకర్షితులవుతున్నారు.

హైదరాబాద్లోని బహదూర్ పురాకు చెందిన ఓ యువకుడికి పాకిస్థాన్ హీరోయిన్ పేరుతో సైబర్ నేరస్తులు వల వేశారు. మ్యాట్రిమోనీ గ్రూప్లో ఉన్న యువకుడికి పాకిస్థాన్ హీరోయిన్ ఫొటో ఉన్న డీపీ నుంచి మెసేజ్ వచ్చింది. నిజేమమని నమ్మిన బహదూర్ పురాకు చెందిన యువకుడు సైబర్ నేరస్తులు చేతిలో మోసపోయాడు.
పాకిస్థాన్ హీరోయిన్ పేరుతో ఆ యువకుడితో సైబర్ నేరస్తులు సంభాషణలు జరిపి, వివిధ కారణాలు చెబుతూ రూ.21 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అన్ని నంబర్లను బ్లాక్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రజలు మోస పోకుండా పోలీసులు ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ, చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. అమ్మాయిల పేరుతో చాటింగ్ చేసినా, మాట్లాడినా చాలా మంది యువకులు ఆకర్షితులవుతున్నారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇదే రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లను నమ్మకూడదు. సోషల్ మీడియా, మ్యాట్రిమోనీ గ్రూప్లలో సెలబ్రిటీ లేదా ప్రముఖుల ఫొటోలను డీపీలుగా పెట్టుకున్న వారితో ఆర్థిక లావాదేవీలు చేయకండి. ఎవరైనా డబ్బు అడిగితే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే స్పందించండి. ఎలాంటి వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు తెలియజేయవద్దు.