నాడు కుస్తీ, నేడు దోస్తీ : బండి సంజయ్తో రాజాసింగ్ చెట్టాపట్టాల్, ఇదేలా సాధ్యమైంది

Bandi Sanjay and Raja Singh : రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న నేత.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. నిత్య వివాదాల్లో ఉండే నేత..గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ ఇద్దరి మధ్య వ్యవహారం కొన్నిరోజుల క్రితం వరకు ఉప్పూనిప్పులా ఉండేది. సంజయ్, రాజాసింగ్ మధ్య అంత సఖ్యత లేదన్న ప్రచారం పార్టీలో జోరుగా జరిగింది కూడా. కానీ..వాస్తవానికి బండి సంజయ్…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ప్రగాఢంగా ఆకాంక్షించిన ప్రథమ వరుస నేతల్లో రాజాసింగ్ ఒకరు.
గ్యాప్ పెరిగిందని చర్చించుకున్నారు : –
సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపడంలో ఇద్దరూ ఇద్దరే. గతంలో పార్టీ అధ్యక్షుడుగా పని చేసిన లక్ష్మణ్తోనూ రాజాసింగ్కు పడేది కాదు. దీంతో సంజయ్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని రాజాసింగ్ భావించారు. అయితే సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీల్లో తన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవట్లేదని గుస్సా అయ్యారట రాజాసింగ్. సంజయ్కు పంపిన వాట్సప్ మెసేజ్,,సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీలో ఒక్కసారిగా అలజడి రేగింది కూడా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన వర్గం నేతలకు టికెట్లు ఇవ్వలేదని రాజాసింగ్…బాహాటంగానే పార్టీ అధ్యక్షుడిపై విమర్శలు చేశారు. అంతే కాదు…సంజయ్ తనను మోసం చేశాడంటూ ఓ ఆడియోను రిలీజ్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ చాలా దూరం పెరిగిందని పార్టీ క్యాడర్ చర్చించుకుంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండేసరికి ఆశ్చర్యపోతోంది అదే పార్టీ క్యాడర్. హైదరాబాద్లో ఏ కార్యక్రమం చేపట్టినా ఇద్దరూ కలిసే వెళ్తుండేసరిగా…ఇంతలోనే ఇదెలా సాధ్యమైందబ్బా అని గుసగుసలాడుకుంటున్నారు.
సంజయ్తో తిరుగుతూ : –
గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఎన్నికల ముందు రోజు.. నెక్లెస్ రోడ్లో బండి సంజయ్పై దాడి చేసేందుకు కార్పొరేటర్ యత్నించారని తెలిసిన వెంటనే.. మీడియాకు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు రాజాసింగ్. ఆ రాత్రికి రాత్రే పార్టీ కార్యాలయానికి చేరుకుని బండి సంజయ్ను పరామర్శించారు. తర్వాత పాతబస్తీలో ఆలయ భూముల రక్షణ కోసం ఇద్దరూ వెళ్లి కార్యకర్తలకు అండగా నిలిచారు. డబీర్పురా పోలీస్స్టేషన్కు వెళ్లి పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు. భాగ్యలక్ష్మి ఆలయానికి కార్పొరేటర్లను తీసుకెళ్లినవారిలో సంజయ్తో పాటు రాజాసింగ్ ఉన్నారు. తాను నమ్ముకున్న గోరక్ష సిద్ధాంతం కోసం పార్టీనైనా తొక్కేస్తానన్న ఈ ఎమ్మెల్యే.. ఇలా సంజయ్తో కలిసి తిరుగుతూ అందర్లోనూ ఉత్సాహం నింపుతున్నారు.
మార్పు రావడానికి కారణం : –
రాజాసింగ్లో ఈ మార్పు రావడానికి కారణం లేకపోలేదంటున్నాయి పార్టీ వర్గాలు. బండి సంజయ్ దూకుడుతో బీజేపీలో ఓ జోష్ వచ్చింది. విజయాలూ దక్కడంతో పార్టీలో ఫాలోయింగ్ కూడా పెరిగింది. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో బండి సంజయ్ ఏం చేసినా ఓ సంచలనమవుతుండడాన్ని రాజాసింగ్ గమనించారట. అంతేకాదు.. డీకే అరుణ, రఘునందన్, సోయం బాపూరావు సైతం మాటల తూటాలు పేలుస్తూ ప్రజల్లో నానుతున్న వైనాన్ని గుర్తించారట. బీజేపీలో పలువురు నేతలు వేగంగా ఎదుగుతున్న తరుణంలో…పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో సఖ్యతగా లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న సంగతినీ గమనించారట. అందుకే… బండితో వైరం కొనసాగించేకంటే.. ఫ్రెండ్లీగా ఉంటేనే మేలని భావిస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని పలువురు నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి బీజేపీ కీలక నేతలు ఇద్దరి మధ్య వైరం తొలగిపోవడంతో క్యాడర్లోనూ నూతనోత్సాహం నెలకొందట.