కేసీఆర్‌ ఏం ప్లాన్‌ వేస్తున్నారు? దానికి రేవంత్ దగ్గరున్న విరుగుడు ఏంటి?

కేసీఆర్‌ సైలెంట్‌గా ఉండటంపై తెలంగాణ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలనే గులాబీ బాస్‌ సైలెంట్‌గా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

కేసీఆర్‌ ఏం ప్లాన్‌ వేస్తున్నారు? దానికి రేవంత్ దగ్గరున్న విరుగుడు ఏంటి?

Gossip Garage Cm Revanth Vs Kcr (Photo Credit : Google)

Updated On : November 21, 2024 / 12:53 AM IST

Gossip Garage : ఆయన మౌనం ఈయనకు కోపం తెప్పిస్తోంది. ఫాంహౌస్‌లో ఉంటావా..ప్రజల్లోకి రా అంటూ గులాబీ దళపతికి సవాల్‌ చేస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఓడగొడితే ప్రజల ముఖం చూడవా అంటూ..ఇగోను టచ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ సవాల్‌ చేస్తున్నారు. కేసీఆర్‌ మౌనం వెనక వ్యూహం ఉందా.? రేవంత్‌ మాటల్లో ఎత్తుగడ కనిపిస్తోందా.? కేసీఆర్ సైలెంట్‌గా ఉంటున్నారంటే ఏదో కథ ఉందని రేవంత్‌ ఆందోళన చెందుతున్నారా.? లేక రెచ్చగొట్టి గులాబీ దళపతిని పబ్లిక్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారా.? అసలు తెలంగాణ గట్టు మీద సీఎం, మాజీ సీఎం ఎత్తుకు పైఎత్తులు ఏంటి.?

గులాబీ దళపతి ఇగోను టచ్‌ చేసి ప్రయత్నం..
మొన్నటి వరకు గులాబీ దళపతి మౌనం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా కొనసాగింది. ఇప్పుడు సీఎం రేవంత్‌ బరస్ట్‌ అవడం టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌గా మారుతోంది. ఏడాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తోన్న సభల్లో..బీఆర్ఎస్‌ అధినేతను టార్గెట్‌ చేస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఏకంగా కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తానని చెప్పి ఓడించా..పార్లమెంట్‌ ఎన్నికల్లో గుండు సున్నా సీట్లే అని చెప్పా.. చేసి చూపించా..మళ్లీ చెప్తున్నా బీఆర్ఎస్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వను రాసి పెట్టుకోండి అంటూ సవాల్‌ చేస్తున్నారు రేవంత్. అంతేకాదు దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ గులాబీ దళపతి ఇగోను టచ్‌ చేసి ప్రయత్నం చేస్తున్నారు సీఎం.

కేసీఆర్‌ను రెచ్చగొట్టే ఎత్తుగడ..!
మౌనంగా ఫామ్ హౌస్‌లో పడుకుంటే నీ సంగతి తేలవదనుకోకు..నీ ముందు తెలుసు..నీ వెనక తెలుసు..నీ ఉపాయం తెలుసు..ఉబలాటం తెలుసు అంటున్నారు రేవంత్. మొన్నటి వరకు కేసీఆర్‌ ఎక్స్‌పైరీ మెడిసిన్‌ అన్న రేవంత్‌..ఇప్పుడు ఒక్కసారిగా బీఆర్ఎస్ అధినేత టార్గెట్‌ చేసి మాట్లాడటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే కొన్నాళ్లుగా కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. అవసరమనిపిస్తే పార్టీ నేతలను ఫాంహౌస్‌కు పిలిచి మాట్లాడుతున్నారు.

ఈ మధ్యే పాలకుర్తి నుంచి పలువురు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన గులాబీ బాస్‌ ఎక్కడా రేవంత్‌ పేరు ప్రస్తావించలేదు. ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైంది.. ఫ్యూచర్‌ అంతా బీఆర్ఎస్‌దేనని చెప్పారు కేసీఆర్. రేవంత్‌ మాత్రం కేసీఆర్ చేసిన కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ తెలంగాణ ఏం కోల్పోయిందో చెప్పాలంటూనే..పర్సనల్‌ అటాకింగ్‌కు దిగుతున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రా అని సవాల్‌ చేయడం వెనక..కేసీఆర్‌ను రెచ్చగొట్టే ఎత్తుగడ ఉందన్న చర్చ జరుగుతోంది.

వరంగల్ సభలో రేవంత్‌ చేసిన నాలుగు కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఫాంహౌస్‌లో మౌనంగా పడుకుంటే నీ సంగతి తెల్వదనుకోకు..నీ ముందు తెలుసు.. వెనక తెలుసు..నీ ఉపాయం, ఉబలాటం తెలుసు అన్నారు. కేసీఆర్ ఉపాయానికి తన దగ్గర విరుగుడు కూడా ఉందంటున్నారు రేవంత్. అసలు కేసీఆర్ ఫాంహౌస్‌లో ఏం చేస్తున్నారు? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అందరు అనుకుంటున్నట్లే మౌనంగా ఉంటూ కేసీఆర్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారా? కేసీఆర్ చేస్తున్న ఉపాయం ఏంటి? రేవంత్‌ మాటల్లో అర్థమేంటి.? ఇదే ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇంతకీ కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తున్నట్లు?
ఇంతకీ కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తున్నట్లు? గులాబీ దళపతి వ్యూహరచనేంటి? కేసీఆర్ వేస్తున్న ప్లాన్ ఏంటో రేవంత్‌కు తెలిసిపోయిందా? అందుకే అంతా తెలుసు..నీ ఉపాయానికి విరుగుడు ఉందంటున్నారా? అసలేం జరుగుతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తున్నారు? దానికి రేవంత్‌ దగ్గర ఉన్న విరుగుడు ఏంటిది? ఇదే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ తెలంగాణ పాలిటిక్స్‌గా మారింది. రేవంత్‌ దగ్గర ఉన్న విరుగుడు అరెస్టులేనా? అనేది కూడా డిస్కషన్ పాయింట్ అవుతోంది.

కేసీఆర్‌ మౌనంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ..
కేసీఆర్‌ సైలెంట్‌గా ఉండటంపై తెలంగాణ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలనే గులాబీ బాస్‌ సైలెంట్‌గా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ రేవంత్‌ మాటలను బట్టి చూస్తుంటే కేసీఆర్ మౌనం వెనక ఏదో ఉందన్న చర్చ తెరపైకి వస్తోంది. అంతేకాదు కేసీఆర్ తన పేరు ప్రస్తావించకుండా విమర్శించడం..ఫాంహౌస్‌లో ఉండే వ్యూహరచణ చేస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టిస్తున్నారని రేవంత్ ఆగ్రహంతో రగిలిపోతున్నారట. అందుకే అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తున్నారట. కేసీఆర్‌ బయటికి వచ్చి తన పేరు ప్రస్తావించి మాట్లాడినా..లేక అసెంబ్లీకి వచ్చినా బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు చేశారంటూ కార్నర్ చేసి ఆయనను సైలెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

గులాబీ బాస్‌ను ప్రజల్లోకి తీసుకొచ్చే ప్లాన్?
ఎంతసేపు తాను కేసీఆర్ మీద మాట్లాడుతుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని..కేసీఆర్‌ తనను విమర్శిస్తే ఆయన మీద మరింత అగ్రెసివ్‌గా కామెంట్స్ చేయొచ్చని రేవంత్‌ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ మాత్రం రేవంత్‌కు కౌంటర్ ఇవ్వడానికి కేటీఆర్, హరీశ్‌ ఇద్దరూ చాలంటోంది. రేవంత్‌ అయితే కేసీఆర్‌నే టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రెచ్చగొట్టి గులాబీ బాస్‌ను ప్రజల్లోకి తీసుకొచ్చే ప్లాన్ జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ మౌనాన్ని బద్దలు చేయాలని..ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నారన్న చర్చకు ఎండ్‌ కార్డ్‌ వేయాలని అనుకుంటున్నారట రేవంత్. అందుకే కేసీఆర్‌ ఇగోను టచ్‌ చేసేలా మాట్లాడుతున్నారని అంటున్నారు పొలిటికల్‌ ఎనలిస్టులు.

పైచేయి సాధించేది ఎవరు?
తన మాటలకు కేసీఆర్ రియాక్ట్‌ అయి అసెంబ్లీకి వస్తే..పొలిటికల్‌ సినారియోను తనకు అడ్వాంటేజ్‌గా మార్చుకోవచ్చనేది రేవంత్ ప్లాన్‌ అంటున్నారు. మరి రేవంత్ సవాల్‌ను స్వీకరించి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..పోనీ రేవంత్ కామెంట్స్ మీద కేసీఆర్ రియాక్ట్‌ అయినా అవుతారా అనేది అంటే డౌటే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. రేవంత్‌ రెచ్చగొడితే కేసీఆర్ బయటికి వస్తారా లేక ఎప్పుడు మౌనం వీడాలో తనకు తానే నిర్ణయించుకుని బయటికి వస్తారా అనేది చర్చనీయాంశం అవుతోంది. సీఎం, మాజీ సీఎం ఎత్తుగడల్లో ఎవరు పైచేయి సాధిస్తారనే కూడా టైమే డిసైడ్‌ చేయనుంది.

Also Read : కమలం పార్టీకి ‘కేటీఆర్ టెన్షన్’ పట్టుకుందా?