Ponguleti Srinivas Reddy : సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తా.. ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా : పొంగులేటి
కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలైందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని మర్యాద పూర్వకంగా అహ్వానించానని తెలిపారు.
Ponguleti Srinivas Reddy – CM KCR : సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ప్రచార కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం కాదని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేయాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని.. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు.
ఈ మేరకు శనివారం ఖమ్మంలో 10టీవీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలైందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని మర్యాద పూర్వకంగా అహ్వానించానని తెలిపారు. కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారని పేర్కొన్నారు. వైఎస్ షర్మిల పాలేరు నుండి పోటీపై తనకు సమాచారం లేదన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. జనాల కోసం పాటుపడే నాయకుడు తుమ్మల అని కొనియాడారు. బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు శాతం ఓట్లు లేని రోజుల్లో కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను బీఆర్ఎస్ లో చేరానని పేర్కొన్నారు. అనంతరం కొందరు కుట్ర పన్ని తనను అవహేళన చేశారని వాపోయారు.