తెలంగాణ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి సవాళ్ల పర్వం
విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం చోటుచేసుకుంది.
Jagadish Reddy Versus Komatireddy venkat reddy: తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సవాళ్ల పర్వం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. ఆనాడు కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టించారో 2015 రికార్డులు తీయాలంటూ వ్యాఖ్యనించారు.
కేసీఆర్పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను తప్పుబట్టే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అనడంతో మరోసారి సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు. జగదీష్ రెడ్డి గురించి కోమటిరెడ్డి చెబుతారని అన్నారు. జగదీష్ రెడ్డిపై హత్యకేసులతో పాటు దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. దీంతో జగదీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలగించాలని స్పీకర్ ను డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు.
Also Read: ఇంక ఎంత కాలం ఊదరగొడతారు?: బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆగ్రహం
జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. జగదీష్ రెడ్డిపై కేసులు నిరూపిస్తానని, నిరూపించక పొతే రాజీనామా చేస్తానని అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై జగదీష్ రెడ్డి స్పందిస్తూ తనపై కేసులు పెట్టిందే కోమటిరెడ్డి అని ఆరోపించారు. సబ్జెక్ట్ నుంచి డివియేట్ కావొద్దని ఆయనను స్పీకర్ పదేపదే కోరారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తేనే మాట్లాడతానని జగదీష్ రెడ్డి భీష్మించారు. నిబంధనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ హామీయివ్వడంతో జగదీష్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.