Note for Vote Case: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో పిటిషన్.. రేవంత్కు నోటీసులు
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.

Note for Vote Case, Revanth Reddy
Note for Vote Case Update : ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు ఈ కేసు విచారణను మార్చాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్కు బదిలీ చేయాలన్న పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. సీఎం, హోం మంత్రిగా ఒకరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని పిటిషనర్ జగదీశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు తెలిపారు. ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే.. విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
ఒకవేళ ట్రయల్పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ట్రయల్ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకువచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై 88 క్రిమినల్ కేసులు నమోదైనట్లు కోర్టుకు తెలిపారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్లు విన్న పోలీసు అధికారులందరినీ నగ్నంగా పరేట్ చేయిస్తా అని గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను కూడా న్యాయస్థానానికి సమర్పించారు. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పందించాలని ఆదేశించింది.