KTR : వెయ్యి కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్.. శంకుస్థాపన చేసిన కేటీఆర్
KTR:

KTR(Photo : Google)
KTR : భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ యూనిట్ కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇందులో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రిక్ పాలసీ నచ్చి మహీంద్రా కంపెనీ జహీరాబాద్ లో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. వెయ్యి కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్న కేటీఆర్.. భవిష్యత్తులో ప్లాంట్ ను మరింతగా విస్తరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
టీఎస్ ఐ-పాస్ ద్వారా 21 రోజుల్లో పరిశ్రమ స్థాపనకు అన్ని అనుమతులు ఇస్తున్నామన్నారు కేటీఆర్. టీఎస్ ఐ-పాస్ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు కేటీఆర్. నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా, అవినీతి లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నామన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 23వేల పరిశ్రమలకు పర్మిషన్స్ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐ-పాస్ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 3 లక్షల 30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. కొత్తగా వచ్చే కంపెనీలలో స్థానిక యువతకు పెద్దపీట వేసి ఉద్యోగాలు ఇస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.
జహీరాబాద్ ప్రాంతంలోని స్థానిక యువత కోసం ప్రభుత్వ పరంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్స్ పెంచుకోవాలని కేటీఆర్ సూచించారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ, తెలంగాణ ప్రైవేట్ వెహికల్స్ లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ప్రణాళిక బద్దంగా చేస్తున్నామన్నారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి సంబంధించిన అన్ని రకాల పార్ట్స్ తయారీ అయ్యే విధంగా ప్రణాళిక రూపొదించామన్నారు. హైదరాబాద్ లో ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ఒప్పందాలు చేసుకున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.