Mallu Ravi: కాంగ్రెస్లో క్రమశిక్షణ వేటు.. నలుగురు సీనియర్లకు షోకాజ్ నోటీసులు.. మల్లు రవి సంచలన నిర్ణయం
పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలతో పలువురు కీలక నేతలకు తెలంగాణ కాంగ్రెస్(Mallu Ravi) కమిటీ క్రమశిక్షణ కమిటీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
mallu ravi Tpcc issues show cause notices to four leaders
- నలుగురు నేతలకు షోకాజ్ నోటీసులు
- పార్టీ లైన్ దాటితే చర్యలు
- గాంధీభవన్లోనే ఫిర్యాదుల స్వీకరణ
Mallu Ravi: పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలతో పలువురు కీలక నేతలకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణ కమిటీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్తో పాటు సీనియర్ నేతలు సంజీవరెడ్డి, జూపల్లి మల్లారెడ్డి, గజ్వేల్ నర్సారెడ్డికి షోకాజ్ నోటీసులు పంపినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి(Mallu Ravi) స్పష్టం చేశారు. పార్టీలో ఎంతటి వారైనా అధిష్టానం నిర్దేశించిన నియమావళికి లోబడి పనిచేయాలని, హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.
పార్టీ లైన్ దాటితే చర్యలు.. నివేదికలపై మల్లు రవి కీలక స్పష్టత:
తాను ఎవరిపైనా వ్యక్తిగత కక్షతో నివేదికలు ఇవ్వలేదని, క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండాలని పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని మల్లు రవి తెలిపారు. మాజీ మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డిలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, వారంతా తన మిత్రులేనని చెప్పారు. నకిరేకల్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హాజరుకావడం శుభపరిణామమని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ఆలోచన తన నిఘంటువులోనే లేదని, నాయకులు లేదా కార్యకర్తలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా గాంధీభవన్కు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు.
గాంధీభవన్లో ఫిర్యాదుల స్వీకరణ:
పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే, క్రమశిక్షణారాహిత్యాన్ని ఏమాత్రం సహించేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. ఏఐసీసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రతి నిర్ణయం ఉంటుందని, ఒకవేళ తాను పొరపాటు చేసినా ఏఐసీసీకి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉందని మల్లు రవి వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
