Telangana : సయోధ్య కుదిరింది.. ముగిసిన మంత్రుల వివాదం.. అడ్లూరి లక్ష్మణ్‌కు క్షమాపణలు చెప్పిన పొన్నం

Telangana Congress : తెంలగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరింది. పొన్నం క్షమాపణలు చెప్పారు.

Telangana : సయోధ్య కుదిరింది.. ముగిసిన మంత్రుల వివాదం.. అడ్లూరి లక్ష్మణ్‌కు క్షమాపణలు చెప్పిన పొన్నం

Telangana Congress

Updated On : October 8, 2025 / 12:55 PM IST

Telangana Congress : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. పొన్నం వ్యాఖ్యలపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పొన్నం క్షమాపణలు చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ అన్నారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే గౌరవం ఉంటుందని తెలిపారు. మాదిగలు అంటే అంత చిన్నచూపా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహచర మంత్రిని ఆ మాట అంటే చూస్తూ ఉంటావా అంటూ ఆ సమయంలో అక్కడే ఉన్న మరో మంత్రి వివేక్ వెంకటస్వామిని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిలదీశారు.

అడ్లూరిపై పొన్నం వ్యాఖ్యలను దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లేదంటే పొన్నం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో మంత్రి పొన్నం ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ఆ ప్రాంతంలో బారికేడ్స్ ఏర్పాటు చేశారు.

వివాదం తీవ్రమవుతుండటంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సయోధ్య కుదర్చేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో బుధవారం మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మంత్రులు పొన్నం పభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు భేటీ అయ్యారు. వీరితో సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేన రెడ్డి, సంపత్ కుమార్, అనిల్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు. నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధపడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నా. నాకు అలాంటి ఆలోచన లేదు. నేను ఆ ఒరవడిలో పెరగలేదు, కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదని పొన్నం ప్రభాకర్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలమంతా సామాజిక న్యాయం కోసం పనిచేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ సూచన మేరకు 42శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుంది
. మేమంతా ఐక్యంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం కోసం పనిచేస్తాం. నా సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నా.. కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గం మేమంతా కలిసి పెరిగాం. నాపై అపోహ ఉండవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నేను ఆ మాట అనకపోయినా క్షమాపణలు చెబుతున్నా. పత్రికా కథనాలతో మంత్రి అడ్లూరి మనస్థాపం చెందారు.. అందుకే ఆయనకు క్షమాపణలు చెబుతున్నా అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. జెండా మోసిన నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీ లైన్ దాటే వ్యక్తిని కాను. సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ ను నేను గౌరవిస్తా. కానీ, ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నా మాదిగ జాతి బాధపడింది. పొన్నం ప్రభాకర్ క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయిందని అన్నారు.