Telangana : కార్యరంగంలోకి దిగిన మంత్రులు…శాఖల వారీగా వేగిరంగా అభివృద్ధి పనులకు శ్రీకారం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రులు కార్యరంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు గ్యారంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని ప్రారంభించారు....
Telangana : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రులు కార్యరంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు గ్యారంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని ప్రారంభించారు. దీంతోపాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులకు రూ.10లక్షల వరకు వైద్యచికిత్సకు అనుమతి ఇచ్చారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రులు…శాఖలవారీగా సమీక్షలు
సీఎంతో పాటు మంత్రులు వేగిరంగా నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కార్యరంగంలోకి దిగారు. మంత్రులకు సచివాలయంలో కార్యాలయాలు కేటాయించడంతో వరుసగా వారు పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. అనంతరం వారి వారి శాఖల పనితీరుపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఆదేశాలు జారీ చేస్తున్నారు.
మంత్రులు జిల్లాల పర్యటనలకు శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి వక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా ఆదివారం ఖమ్మంజిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. తాము సంపదను సృష్టించి పేదలకు పంచుతామని భట్టి విక్రమార్క ప్రకటించారు.
100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు
తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. బహుళార్థ సాధక ప్రాజెక్టులు, పరిశ్రమలను ప్రోత్సహించి పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. సీతారామ ప్రాజెక్టును పూర్తిచేస్తామని మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ALSO READ : Telangana Cool Winds : తెలంగాణలో పెరిగిన చలిగాలులు…ప్రజలను వణికిస్తున్న చలి
ఆర్టీసీ విలీన ప్రక్రియపై గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించడంతోపాటు ఆర్టీసీ ఆస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామని మంత్రి ప్రకటించారు. బీసీలకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో మాట్లాడి, వారి సలహాలు పాటిస్తామని మంత్రి పేర్కొన్నారు. అధికారులతో మంత్రి పొన్నం సమీక్షలు ప్రారంభించారు. జోగిపేట పట్టణంలో త్వరలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తామని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.
ALSO READ : Telangana Minister Seethakka : అడవి బాట నుంచి అమాత్యురాలిగా…సీతక్క వినూత్న రాజకీయ ప్రయాణం
వైద్యశాఖ పనితీరుపై మంత్రి అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. పర్యావరణం, అడవుల పరిరక్షణకు పనిచేస్తానని అటవీ శాఖాధికారుల సమావేశంలో మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తానని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ, ఇతర పార్టీల కార్యాలయాలున్న భవనాన్ని తొలగించి అసెంబ్లీ ప్రాంగణాన్ని సుందరీకరిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.
ALSO READ : Crimes Against Women : దేశంలో మహిళలపై పెరిగిన నేరాలు…నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చెబుతుందంటే…
ఏపీ శాసనసభ భవనంలో మరమ్మతులు చేసి శాసనమండలి సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. పబ్లిక్ గార్డెన్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తామన్నారు. నల్గొండ నుంచి ముషంపల్లి మీదుగా ధర్మాపురం వరకు ఉన్న రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ : Cyber Criminals : నదిలో దూకిన సైబర్ నేరగాళ్లు…వెంటాడి పట్టుకున్న పోలీసులు
నకిరేకల్-నాగార్జునసాగర్ రోడ్డును పూర్తి చేసి, హైదరాబాద్-విజయవాడ రోడ్డును ఆరు లైన్లుగా విస్తారిస్తామని మంత్రి ప్రకటించారు. హైదరాబాద్-కల్వకుర్తి రోడ్డును నాలుగు లైన్లుగా మార్చే ప్రతిపాదనలపై మంత్రి సంతకం చేశారు. తెలంగాణలోని అన్ని రోడ్లను మరమ్మతులు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.