Telangana : పోడు రగడకు ఇక చెక్..న్యాయంగా సాగు చేసుకుంటున్నారో వారికే ఆ భూములు

పోడు సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ సర్కార్‌ రెడీ అయింది. పోడు రగడకు చెక్‌ పెట్టేలా తొలి అడుగు పడనుంది.

Telangana : పోడు రగడకు ఇక చెక్..న్యాయంగా సాగు చేసుకుంటున్నారో వారికే ఆ భూములు

Telangana Cm Kcr

Updated On : November 8, 2021 / 7:49 AM IST

Podu Lands Issue : పోడు సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ సర్కార్‌ రెడీ అయింది. పోడు రగడకు చెక్‌ పెట్టేలా తొలి అడుగు పడనుంది. 2021, నవంబర్ 08వ తేదీ సోమవారం నుంచి.. పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు తీసుకోనుంది. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే.. అటవీ భూములను రక్షించేందుకు కేసీఆర్‌ సర్కార్‌ సిద్ధమైంది. అందులో భాగంగానే.. అడవి మీద ఆధారపడి బతికే అమాయకులైన గిరిజనులకు మేలు చేయడంతో పాటు అడవులను నాశనం చేసే శక్తులను గుర్తించి వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Read More : HYD : విదేశాల్లో ఉండి..ఇంట్లో ఫ్యాన్ ఆఫ్ చేయవచ్చు..విద్యార్థినుల ప్రతిభ

అడవుల్లో.. పోడు సాగు చేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగుకు కేటాయించాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్‌. ప్రభుత్వ భూములు లేకపోతే.. అటవీ భూముల అంచున సాగు భూమిని కేటాయించి.. వారికి నీరు, కరెంటు, నివాస సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. అటవీ భూములకు శాశ్వత హద్దులను గుర్తిస్తూ.. కంచెలు వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని.. బయటి నుండి వచ్చే శక్తులే అడవిని నాశనం చేస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్‌.

Read More :Covid’s AY.4.2 : భయం వద్దు…AY.4.2 వేరియంట్ ప్రభావం తక్కువే!

గోండు, కోలం, కోయ వంటి గిరిజన తెగల అడవి బిడ్డలు అడవికి నష్టం చేయరని చెప్పారాయన. బయటి నుండి వచ్చే శక్తులు అడవులను ధ్వంసం చేయకుండా కట్టడి చేయాలని ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఎవరైతే న్యాయంగా పోడు సాగు చేసుకుంటున్నారో.. వారికే ఆ భూములు కేటాయిద్దామంటూ గతంలోనే ప్రకటించారు సీఎం కేసీఆర్‌.