కొండా సురేఖ, పొంగులేటి మధ్య గ్యాప్ సెట్ కాలేదా? ఆ టెండర్లపై ముసలం కంటిన్యూ?
సిచ్యువేషన్ బాలేనప్పుడు సైలెంట్గా ఉండటమే బెటరనే ఆలోచనలో ఉందట కొండా వర్గం.
Konda Surekha, Ponguleti Srinivas (Image Credit To Original Source)
- జిల్లా అభివృద్ధి సమీక్షకు కొండా ఎందుకు హాజరు కానట్లు?
- మేడారం జాతర టెండర్లపై ముసలం కంటిన్యూ అవుతోందా?
- తన వ్యతిరేక వర్గాన్ని పొంగులేటి ప్రోత్సహిస్తున్నారని కొండా ఆగ్రహం!
Congress MLAs: ఓరుగల్లు కాంగ్రెస్లో సమసిపోయినట్టు కనిపించిన గ్రూప్ వార్ మళ్లీ బ్లాస్ట్ అయింది. గత కొన్ని రోజుల క్రితం ముదిరి పాకాన పడి..హస్తినలో సెగలు పుట్టించి..తిరిగి హైదరాబాద్ చేరి చల్లారినట్టు కనిపించిన కుంపటి మళ్లీ రాజుకున్నట్లే కనిపిస్తోంది. జిల్లా అభివృద్ధి సమీక్ష వేదికగా జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి సాక్షిగా ఆన్ స్క్రీన్పై కాంగ్రెస్లో గ్రూప్వార్ కొట్టొచ్చినట్లు కనిపించింది.
తమను విభేదిస్తూ సొంత పార్టీలో గ్రూపుల కుంపటి రాజేస్తున్న వారిని..ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెంటేసుకుని తిరుగుతున్నారని గతంలో ఓ సారి రచ్చ చేశారు మంత్రి కొండా సురేఖ దంపతులు. మేడారం టెండర్ల విషయంలో కూడా పొంగులేటి తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం పెద్ద చర్చకు దారితీసింది.
జిల్లాల్లో తన వ్యతిరేక వర్గాన్ని వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రోత్సహిస్తున్నారని.. గుస్సా అవుతున్నారు కొండా దంపతులు. ఆ మధ్య రాజుకున్న పంచాయితీని ఏదోలా సెట్ చేసి చివరకు రాజీ కుదిర్చారు కాంగ్రెస్ పెద్దలు. అయితే ఇటీవల ఓరుగల్లు కాంగ్రెస్లో సేమ్ సీన్ రిపీట్ అవుతోందట. లేటెస్ట్ డెవలప్మెంట్స్ కొండాకు మళ్లీ కోపం తెప్పిస్తున్నాయట. తన సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పులో వర్గ విభేదాలు తెరమీదకు వస్తుండటంతో ఆమె ఆగ్రహంతో రగిలిపోతున్నారట.
ఈ సారి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య సెంట్రిక్గా తన నియోజకవర్గంలో చిచ్చు పెట్టే కుట్ర జరుగుతుందనేది కొండా సురేఖ అనుమానమట. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అక్రమ కేసులు బనాయిస్తున్నారని, చట్టం అమలులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య స్వయంగా పోలీస్ బాస్కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్లో కలవరం రేపుతోంది.
ఆహ్వానం అందటం లేదని..
వరంగల్లో జరుగుతున్న కార్యక్రమాలకు తనకు ఆహ్వానం అందటం లేదని.. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఇంచార్జ్ మంత్రి పొంగులేటి ముందే ప్రస్తావించారు బస్వరాజ్ సారయ్య. అయినా పొంగులేటి సైలెంట్గా ఉండటం ఆసక్తికరంగా మారింది
వరంగల్ జిల్లా రాజకీయాల్లోనూ, వరంగల్ తూర్పులో గతంలో మాదిరిగానే సేమ్ సీన్ రిపీట్ అవుతోందట. కొండా వ్యతిరేకులంతా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి పంచన చేరి, ఆయన పర్యటనల్లో యాక్టివ్గా ఉంటం, వాళ్లంతా మంత్రి శ్రీనివాస్రెడ్డితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం కొండా సురేఖకు ఏ మాత్రం నచ్చడ లేదట. తన వ్యతిరేక వర్గాన్ని పొంగులేటి ఎంకరేజ్ చేస్తున్నారని..కొండా సురేఖ మరోసారి మనస్థాపానికి గురైనట్టు టాక్ వినిపిస్తోంది.
అందుకే ఆమె మౌనమే అస్త్రంగా ఉండిపోతున్నారట. దేవాదాయశాఖ మంత్రిగా..సహచర మంత్రి సీతక్కతో కలిసి ముఖ్య ప్రజా ప్రతినిధులకు మేడారం జాతర ఆహ్వానాలు అందిస్తున్నారు కొండా సురేఖ. కానీ వరంగల్ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి మాత్రం గైర్హాజరయ్యారు. తన వ్యతిరేక వర్గం తీరు, వారిని మంత్రి పొంగులేటి ప్రోత్సహిస్తున్నారన్న అసంతృప్తితోనే ఆమె రివ్యూ మీటింగ్కు దూరంగా ఉన్నారట.
గతంలోనూ పొంగులేటి ఇంతే అంటూ..
గతంలో తన వ్యతిరేక వర్గానికి తనకు మధ్య జరిగిన పంచాయితీ విషయంలోనూ మంత్రి పొంగులేటి ఇలాగే నడుచుకున్నారని..మళ్లీ పాత సీన్ రిపీట్ అవుతుందని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వరంగల్ నగరంలో జరిగే అభివృద్ధి, కీలక నిర్ణయాలు అన్నీ ఇంచార్జ్ మంత్రి పొంగులేటి కనుసన్నల్లో జరిగేలా సంకేతాలు రావడం, అవి క్షేత్రస్థాయిలో అమలు అవుతుండటంతో..మౌనమే సమాధానంగా సరికొత్త ఎత్తుగడతో వెళ్తున్నారట మంత్రి కొండా.
సిచ్యువేషన్ బాలేనప్పుడు సైలెంట్గా ఉండటమే బెటరనే ఆలోచనలో ఉందట కొండా వర్గం. తనకు పొగబెడుతున్నోళ్లతో పొంగులేటి భుజం భుజం రాసుకుని తిరగడం నచ్చకే జిల్లా సమీక్ష సమావేశానికి కొండా సురేఖ డుమ్మా కొట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే రివ్యూలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు దూరంగా ఉంటున్న కొండా సురేఖ ..ఎప్పుడు బరస్ట్ అవుతారో..ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయితీ మళ్లీ ఎప్పుడు రచ్చకెక్కుతుందోనన్న ఆందోళన మాత్రం కంటిన్యూ అవుతోంది.
