Ponguleti: వరంగల్ కాంగ్రెస్లో అంతా పెద్దలే… పెత్తనం మాత్రం మంత్రి పొంగులేటికి..
కాకతీయ యూనివర్సిటీలో కొన్ని టెండర్ల వ్యవహారంలోనూ తమకు సమాచారం లేదని మంత్రితోపాటు, కొందరు ఎమ్మెల్యేలు ఆవేదన..
![Ponguleti: వరంగల్ కాంగ్రెస్లో అంతా పెద్దలే… పెత్తనం మాత్రం మంత్రి పొంగులేటికి.. Ponguleti: వరంగల్ కాంగ్రెస్లో అంతా పెద్దలే… పెత్తనం మాత్రం మంత్రి పొంగులేటికి..](https://10tv.in/wp-content/uploads/2024/08/maxresdefault-4_cleanup.png)
ఆ జిల్లాలో అందరూ వీఐపీలే… ప్రతి ఎమ్మెల్యే తనది మంత్రి రేంజ్ అనుకుంటూ ఉంటారు.. ఎమ్మెల్యేలు కాని నేతలు సైతం సీఎం స్థాయిని ఊహించుకుంటుంటారు. ఇక మంత్రులుగా ఉన్నవారు కూడా తమ మాటే శాసనం అన్నట్లు అధికారం చెలాయించాలని చూస్తారు… కానీ, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు… అక్కడి నేతల అధికారానికి అధిష్టానం కత్తెర పెట్టిందంట…. ఏదైనా సరే ఇన్చార్జి మంత్రి ఇష్టప్రకారమే జరగాల్సిందని తేల్చిచెప్పేశారట.
దీంతో ఇన్చార్జి మంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో కొందరు… తమను ఎవరూ పట్టించుకోవడం లేదని మరికొందరు లోలోపల ఫీల్ అవుతున్నట్లు చెబుతున్నారు…. ఏదైనా సరే కాంగ్రెస్ అంటేనే ఇలా ఉంటుందని తమలో తాము సర్దిచెప్పుకుంటున్నారట….
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా, హస్తం పార్టీకి 11 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక్క జనగాం ఎమ్మెల్యే పల్లా రాజశ్వేర్రెడ్డి మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక 11 మంది ఎమ్మెల్యేల్లో కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా ఉండగా, సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి వంటివారు తమ నియోజకవర్గాల్లో తామే హోల్ అండ్ సోల్ అంటున్నారు.
ఇక ఎమ్మెల్యే కానప్పటికీ జిల్లాకు చెందిన వేం నరేందర్రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా బయటకు వరంగల్ కాంగ్రెస్లో అంతా పెద్దలుగానే కనిపిస్తున్నప్పటికీ… వీరందరిపై పెత్తనాన్ని పక్క జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి సీఎం అప్పగించడంతో తమ మాట చెల్లుబాటు కావడం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అప్పట్లో చక్రం తిప్పిన సురేఖ
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ సీనియర్ నాయకురాలు. తొలి నుంచి కాంగ్రెస్లో ఉన్న సురేఖ మధ్యలో పార్టీ మారినా… కాంగ్రెస్లో తానే సిన్సియర్ లీడర్ అని భావిస్తుంటారు. ఇక జిల్లాలో తన మాటే చెల్లుబాటు కావాలన్నట్లు సురేఖ రాజకీయం చేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా, జిల్లాలో మంత్రి సురేఖ చక్రం తిప్పారు. ఇక వైఎస్ మరణాంతరం పార్టీలు మారినా… 2018 ఎన్నికలకు ముందు సొంత గూటికి చేరారు సురేఖ. ఆ తర్వాత సీఎం రేవంత్రెడ్డికి మద్దతుగా నిలిచి…. మరోసారి మంత్రి పదవి చేపట్టారు.
ఇంతవరకు అంతా తాను అనుకున్నట్లే చక్రం తిప్పిన సురేఖ ఈ మధ్య తన మాట చెల్లుబాటు కావడం లేదని ఫీల్ అవుతున్నారట… జిల్లా ఇన్చార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి బాధ్యతలు అప్పగించడం… అంతా ఆయన అనుమతి ప్రకారమే నడుచుకోవాలని సీఎం సూచించడంతో సురేఖ చేతులు కట్టేసినట్లైందని చెబుతున్నారు ఆమె అనుచరులు. తన సొంత నియోజకవర్గానికి సంబంధించిన నిర్ణయాలను కూడా తాను స్వయంగా తీసుకోలేకపోవడం వల్ల రాజకీయంగా నష్టం జరుగుతోందని మంత్రి సురేఖ ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ నగరాభివృద్ధిలో తన ప్రమేయం తగ్గిపోతుందని మంత్రి సురేఖ మదనపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా తన నియోజకవర్గానికి చెందిన మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్లో చేరిన విషయం తనకు తెలియజేయలేదని మంత్రి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమే ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో మంత్రి సురేఖ ఫోన్లో వాదులాటకు దిగడం ఆ మధ్య వైరల్గా మారింది.
అందరూ సీనియర్లే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, తాను మంత్రిగా పనిచేస్తుండగా, తన జిల్లా.. తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా నిర్ణయాలు జరిగిపోతుండటమే మంత్రి సురేఖకు అసంతృప్తికి గురిచేస్తోందని చెబుతున్నారు. అదేవిధంగా ఇటీవల కాకతీయ యూనివర్సిటీలో కొన్ని టెండర్ల వ్యవహారంలోనూ తమకు సమాచారం లేదని మంత్రితోపాటు, కొందరు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పొంగులేటికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించినా.. తమ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే బాగుండేదని… మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నట్లు చెబుతున్నారు.
జిల్లాలో అందరూ సీనియర్లే కావడం… పైగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో నేరుగా సంబంధాలు ఉండటంతో ఎవరూ ఈ విషయంలో బహిరంగ వ్యాఖ్యలు చేయనప్పటికీ… మంత్రి పొంగులేటి తమను కలుపుకుని వెళితే ఇంకా బాగుంటుందని చెప్పుకుంటుండటమే హాట్టాపిక్గా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఆవేదన ఇన్చార్జి మంత్రి పొంగులేటి దృష్టికి వెళ్లిందో? లేదో? కానీ, ఉమ్మడి వరంగల్లో ఏ ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలిసినా ఇదే విషయం చర్చించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్చార్జి మంత్రి పొంగులేటి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల అసంతృప్తిని ఎలా సరిదిద్దుతారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: పాలిటిక్స్లో 30 ఇయర్స్ అనుభవం ఉన్న నేతలు.. అయినా మౌనం!