Praja Sangrama Yatra : తెలంగాణలోని పథకాలు అమలు చేయాలి – రాయ్ చూర్ రైతులు
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇక్కడ అమలయ్యే విధంగా చూడాలని వారు కోరడం విశేషం. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, దళిత బంధు పథకాలపై ప్రభుత్వంతో మాట్లాడి అమలయ్యేలా చూడాలని...

Bandi
Raichur Farmers Meet Bandi Sanjay : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వినూత్న పథకాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. ఇక్కడ అమలవుతున్న పథకాల వివరాలు తెలుసుకొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు తెలంగాణకు విచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్నాటక రాష్ట్రం రాయ్ చూర్ రైతులు ఈ పథకాల పట్ల విశేషంగా ఆకర్షితులవుతున్నారు. తాజాగా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్న బండి సంజయ్ ను అక్కడి రైతులు కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇక్కడ అమలయ్యే విధంగా చూడాలని వారు కోరడం విశేషం. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, దళిత బంధు పథకాలపై ప్రభుత్వంతో మాట్లాడి అమలయ్యేలా చూడాలని రైతులు కోరారు.
Read More : Minister gangula: తెలంగాణపై కిషన్ రెడ్డి విషం చిమ్ముతుండు.. ఒక్క గింజకూడా పక్కదారి పట్టదు..
బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, రంగారెడ్డి జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 105 గ్రామాల్లో యాత్ర కొనసాగనుంది. బండి సంజయ్ పాదయాత్రపై ఇటీవలే మంత్రి కేటీఆర్ సెటైర్స్ వేసిన సంగతి తెలిసిందే. రాయ్ చూర్ జిల్లాలో కూడా పాదయాత్ర చేయాలని, అక్కడికి వెళ్లి బీజేపీ పాలన ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో ఇస్తున్నట్లు 24 గంటల కరెంటు, ఇంటింటికి నీళ్లు, రైతు బంధు, రైతు బీమా, ఫించన్లు వస్తున్నాయో చూడాలని సూచించారు. తెలంగాణలో పాలన, సంక్షేమం బాగుందని రాయ్ చూర్ బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసించారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాయ్ చూర్ రైతులు చేసిన విజ్ఞప్తికి తెలంగాణ బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.