Telangana Poll Results: ఓడిపోయినా సిర్పూర్ లోనే ఉంటా.. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ ప్రెస్ మీట్
బీజేపీకి సహకరించారన్న వాదనపై ఆయన స్పందిస్తూ.. పార్టీకి తాము వ్యతిరేకమని, మతోన్మాదానికి దూరమని స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, తమ గెలుపుకోసం ఎన్నికల బరిలోకి వచ్చామని అన్నారు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తాను సిర్పూరులోనే ఉంటానని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన సహా బీఎస్పీ అభ్యర్థులందరూ ఓటమిపాలయ్యారు. కాగా, ఈ విషయమై ఆయన సోమవారం కొమురంభీం జిల్లా కాగజ్నగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని రాబోయే రోజుల్లో మరింత ఉన్నతంగా పని చేస్తామని అన్నారు. ఇదే సందర్భంలో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ కు అభినందనలు తెలిపారు.
‘‘బీఆర్ఎస్ పార్టీ దాడులు, రిగ్గింగ్ లు ఎన్ని ఆటంకాలు సృష్టించిన బీఎస్పీకి 44 వేల ఓట్లు వేసిన సిర్పూర్ ప్రజలకు ధన్యవాదాలు. సిర్పూర్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి. అందరికి అండగా ఉంటా. ఇంతకు ముందు ప్రారంభించిన హెల్ప్ లైన్ నంబర్ ఇకముందు కూడా అందుబాటులో ఉంటుంది. అసెంబ్లీలో మేము ఉంటే సిర్పూర్ ని అభివృద్ధి చేస్తామని అనుకున్నాం. ఓడిపోయినా నేను సిర్పూర్ లోనే ఉంటా ఇక్కడి సమస్యలపై పోరాటం చేస్తా’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా భట్టి, సీతక్క
బీజేపీకి సహకరించారన్న వాదనపై ఆయన స్పందిస్తూ.. పార్టీకి తాము వ్యతిరేకమని, మతోన్మాదానికి దూరమని స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, తమ గెలుపుకోసం ఎన్నికల బరిలోకి వచ్చామని అన్నారు. ఓటమి కాస్త బాధించిందని, అయితే తనకు 44 వేల ఓట్లు వచ్చాయని, అంత మంది తనకు మద్దతు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో పార్టీ కేవలం 1.37 శాతం ఓట్లకే పరిమితమవ్వడంపై స్పందిస్తూ.. తమ క్యాడర్ పూర్తిగా సన్నద్ధం కాకపోవడం వల్లే బిఎస్పీ రాష్ట్రంలో ఒక్క సీట్ గెలువలేకపోయిందని అన్నారు.
సిర్పూరులో గుండాగిరిని సాగనివ్వబోమని, ఎట్టి పరిస్థితుల్లో మతోన్మాదాన్ని సాగనివ్వమని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటై గెలుపొందారు. ఒక దొర వెళ్తే మరో దొరకు అవకాశం వచ్చిందని, దాన్ని అంతం చేయడమే తమ పంతమని అన్నారు. ప్రజలకు సేవ చేసే ఏ అవకాశాన్ని తాము వదులుకోమని, సిర్పూర్ లో కుటుంబ సమేతంగా ఉంటానని, హైదరాబాదుకు వెళ్లినప్పటికీ సిర్పూర్ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం ఖాయం : జీవీఎల్