భూమా అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురు.. ఆస్పత్రికి తరలించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత

భూమా అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురు.. ఆస్పత్రికి తరలించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత

Updated On : January 7, 2021 / 7:45 PM IST

Secunderabad court dismisses petition filed by Bhuma Akhilapriya : ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఆస్పత్రికి తరలించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలంటూ సికింద్రాబాద్ కోర్టులో అఖిలప్రియ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అఖిలప్రియ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

జైలులో అవసరమైన వైద్య సదుపాయాలు ఉంటాయని తెలిపింది. జైలు అధికారులు ఆస్పత్రికి తరలించాలని సూచిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. బెయిల్ పిటిషన్ పై రేపు సికింద్రాబాద్ కోర్టు విచారించనుంది.

మరోవైపు బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. నిన్న ఉదయం పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేయగా… సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. దీంతో న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే బెయిల్ మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్‌పై ఇవాళ సికింద్రాబాద్ కోర్టులో వాదనలు జరిగాయి.

ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నందున బెయిలివ్వాలంటూ అఖిలప్రియ తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఇప్పటికే ఏ2గా ఉన్న అఖిలప్రియను.. ఏ1గా మార్చకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. దీంతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.

మరోవైపు బోయిన్ పల్లి కిడ్నాప్‌ కేసు సూత్రధారి భూమా అఖిలప్రియేనని పోలీసులు నిర్థారించారు. భూమా అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడించారు. భూమా అఖిలప్రియను ఏ1గా చూపిన పోలీసులు.. ఏవీ సుబ్బారెడ్డిని ఏ2, భార్గవరామ్‌ను ఏ3గా రిమాండ్‌ రిపోర్టులో చేర్చారు. అలాగే శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాశ్‌లను నిందితులుగా పేర్కొన్నారు.

కళ్లకు గంతలు కట్టి తమను తీసుకెళ్లినట్లు బాధితులు చెప్పారని అందులో పొందుపరిచారు. 2016లో హఫీజ్‌పేట సర్వే నం.80లో 25ఎకరాలను బాధితులు కొనుగోలు చేశారని పోలీసులు కోర్టుకు తెలిపారు. భూమి తమదేనని అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, భార్గవరామ్‌ వాదిస్తున్నారని, సుబ్బారెడ్డికి ప్రవీణ్‌రావు డబ్బులిచ్చి సెటిల్‌ చేసుకున్నారని రిపోర్టులో పేర్కొన్నారు.

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో నిన్న భూమా అఖిలప్రియకు రిమాండ్ విధించారు. భూమా అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్ మంజూరు చేయాలని అఖిలప్రియ పిటిషన్ దాఖలు చేశారు. అంతకముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

నీరసం వల్లే అఖిలప్రియ కళ్లు తిరిగి పడిపోయిందని… ఆమెకు ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. వైద్య పరీక్షలు పూర్తైన వెంటనే అఖిలప్రియను పోలీసులు రహస్యంగా తరలించారు. ఆ సమయంలో గాంధీ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇక వైద్య పరీక్షలు పూర్తవడం అఖిలప్రియను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.