ఫ్రెండ్‌కి బైక్ ఇచ్చిన పాపానికి జైలుకెళ్లిన విద్యార్థి, మీరు ఇలాంటి తప్పు చేయొద్దు

ఫ్రెండ్‌కి బైక్ ఇచ్చిన పాపానికి జైలుకెళ్లిన విద్యార్థి, మీరు ఇలాంటి తప్పు చేయొద్దు

Updated On : February 23, 2021 / 2:54 PM IST

student went jail for giving bike: డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బైక్ లు ఇవ్వడం నేరం. వారు ఏదైనా యాక్సిడెంట్ చేసినా లేదా ప్రమాదానికి గురైనా… వాహనం యజమానిదే బాధ్యత. అతడే నిందితుడు అవుతాడు. ఈ విషయాన్ని పోలీసులు పదే పదే చెబుతున్నారు. నెత్తీనోరు బాదుకుంటున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, మైనర్లకు వాహనాలు ఇస్తున్నారు. ఆ తర్వాత కష్టాల్లో పడుతున్నారు. జైలుకి వెళ్తున్నారు. తాజాగా, తన స్నేహితురాలికి వాహనాన్ని ఇచ్చిన ఓ హోటల్ మేనేజ్ మెంట్ స్టూడెంట్, ఇప్పుడు ఓ కేసులో ఏ1 నిందితుడిగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

గత శుక్రవారం రాత్రి హైదరాబాద్ కూకట్ పల్లిలో డెంటల్ విద్యార్థిని రేష్మ, స్కూటీని నడుపుతూ, రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర గాయాల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు రేష్మకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించారు. ఆ వాహనం అజయ్ సింగ్ (23) అనే స్టూడెంట్ దని గుర్తించారు. స్నేహితురాలే కదా అని అతను ఆమెకు వాహనాన్ని ఇచ్చాడని, ఆ వాహనం లారీని ఢీకొనగా రేష్మ దుర్మరణం పాలైందని తెలిపారు.

ఈ కేసులో నిబంధనల ప్రకారం, స్కూటీ యజమాని అజయ్ సింగ్ ను ఏ1గా(ప్రధాన నిందితుడు), ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను ఏ2గా(రెండవ నిందితుడు) కేసు నమోదు చేశారు పోలీసులు. అజయ్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇకనైనా వాహనదారులు మారాలని పోలీసులు కోరుతున్నారు. డ్రైవింగ్ నిబంధనలు ఇప్పుడు చాలా కఠినంగా అమలవుతున్నాయని చెప్పారు. అందరూ రూల్స్ ఫాలో అవ్వాలన్నారు. లేదంటే, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.