Telangana Corona : తెలంగాణలో కరోనా టెన్షన్.. కొత్తగా ఎన్ని కేసులంటే.. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచన

కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల హెచ్చరించారు. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు వాడాలన్నారు.

Telangana Corona : తెలంగాణలో కరోనా టెన్షన్.. కొత్తగా ఎన్ని కేసులంటే.. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచన

Telangana Corona Bulletin

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదలైంది. రాష్ట్రంలో కొత్తగా 4 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా కరోనా సోకిన వారి స్క్వాబ్ నమూనాలను పరీక్షలకు పంపారు వైద్యులు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ పై టెన్షన్ మొదలైంది. కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల హెచ్చరించారు. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు వాడాలన్నారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు టెస్టుల సంఖ్య పెంచారు.

కరోనా కొత్త వేరియంట్ JN-1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కొత్త వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. సింగపూర్ లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్ లోనూ అదే రీతిలో ప్రబలుతుండటం కంగారు పెడుతోంది. ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో ఐదుగురు మరణించారు. మరోవైపు కేరళలో గడిచిన 24 గంటల్లో 127 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు సరిపడా ఆర్టీ పీసీఆర్ కిట్లు పంపిణీ చేసి, అనుమానితులకు టెస్టులు చేయాలని సూచించింది.

కేరళలో తొలి కేసు నమోదు..
దేశంలోనే తొలిసారి కేరళలో కరోనా సబ్ వేరియంట్ JN.1 బయటపడింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికాలో మొదట దీన్ని గుర్తించారు. 38కి పైగా దేశాలకు ఈ వేరియంట్ విస్తరించింది. దీని వల్లే మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. ఇక, ఇది సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు, తల, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని, మనిషి రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని హెచ్చరించారు.

Also Read : పచ్చి మిరపకాయ ప్రమాదక వ్యాధుల నుండి కాపాడుతుందని మీకు తెలుసా?

వారికి మాస్క్ మస్ట్..
దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు, మరణాలు వెలుగు చూస్తుండటంతో కర్నాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. 60ఏళ్లు పైబడిన వారికి దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే కచ్చితంగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. కేరళ సరిహద్దు జిల్లాల్లో పర్యవేక్షణ పెంచాలని, ఆసుపత్రుల్లో కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

24 గంటల్లో 335 కరోనా కేసులు, 5 మరణాలు..
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 335 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. కొత్తగా 5 మరణాలు సంభవించాయి. ఇందులో 4 మరణాలు కేరళలోనే నమోదు కాగా, ఉత్తరప్రదేశ్ లో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉంది. ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 5లక్షల 33వేల 317గా ఉంది.

Also Read : 10 ఏళ్లకే రుతుస్రావం ప్రారంభమైన 65 ఏళ్ల లోపు మహిళల్లో డయాబెటీస్, స్ట్రోక్ ప్రమాదం?

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. కోట్లాది మందిపై ప్రభావం చూపింది. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఆ తర్వాత మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, కరోనా తగ్గుముఖం పట్టింది ఇక భయం లేదు అని అనుకున్న ప్రతిసారీ కొత్త వేరియంట్లు కలవర పెడుతున్నాయి. చైనాలో వ్యాప్తి చెందుతున్న JN.1 సబ్ వేరియంట్ కేరళలో తొలిసారి బయటపడింది. దీన్ని పిరోలా/BA.2.86 అని కూడా పిలుస్తున్నారు.