Telangana elections 2023: బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని అడుగుతా: మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కామెంట్స్
గడ్డం అరవిందరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ సమ్మేళనానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

Gaddam Aravind Reddy
Telangana elections 2023 – Gaddam Aravind Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయమే ఉండడంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంచిర్యాల (Mancherial) జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ (BRS) నేత గడ్డం అరవింద్ రెడ్డి నివాసంలో ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
గడ్డం అరవిందరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ సమ్మేళనానికి ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దివాకర్ రావుకు పరిపాలన చేతగాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినప్పటికీ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రజలు తనను లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఈ ఎన్నికల్లో గెలిపించుకుంటామని చెబుతున్నారని అన్నారు.
త్వరలోనే తాను బీఆర్ఎస్ అధిష్ఠానాన్ని, అగ్రనేతలను కలుస్తానని, మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మార్చాలని విజ్ఞప్తి చేస్తానని గడ్డం అరవింద్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న నేతలకు గుర్తింపు లేదని అన్నారు. మంచిర్యాల అసెంబ్లీ స్థానంలో సర్వేల్లో తక్కువ పాప్యులారిటీ శాతం వచ్చిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం సరికాదని చెప్పారు. తాను గతంలో కేసీఆర్ సూచన మేరకే ఈ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయలేదని తెలిపారు.