కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం

కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేవాదాయ, వక్ఫ్ భూములు క్రయ, విక్రయాలు రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామన్నారు. ఆలయ భూములను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కొత్త రెవెన్యూ చట్టంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. 77వేల ఎకరాల వక్ఫ భూముల క్రయవిక్రయాలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. రేపటి నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తున్నట్టు తెలిపారు. ఒక్క చట్టంతో అంతా మారిపోతుందంటే అనేక అనుమానాలు వస్తాయని కేసీఆర్ తెలిపారు.
ప్రతిచోటా లిటిగేషన్లు ఉంటాయని అనుకోకూడదని చెప్పారు. గతంలో జాగా లేకున్నా సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పారు. నా సొంతూళ్లోనే 90 ఎకరాలు ఉంటే 120 మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇచ్చిన భూమికి దారి లేదు. గట్లు లేవు.. ఇలాంటి తప్పులన్నింటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నింటిని ఒకేసారి సరిచేయలేమని, దశలవారీగా పరిష్కరించాలని సూచించారు. 1962 నుంచి 2003 వరకు వక్ఫ్ భూముల సర్వేపై 62 గెజిట్లు ఇచ్చారని కేసీఆర్ తెలిపారు. 77,538 ఎకరాల వక్ఫ్ భూమికి ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందని చెప్పారు.
ఈ భూమి మొత్తాన్ని కాపాడుతామని హామీ ఇస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. సమగ్ర భూ సర్వే తర్వాతే సమస్యలకు పరిష్కారం దొరకుతుందని అన్నారు.అటవీ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క గుంట కూడా అటవీ భూమి కబ్జా కానివ్వమన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికి పట్టాలిస్తామన్నారు.
సాదాబైనామా విషయంలో లిబరల్ గా వ్యవహరించామని చెప్పారు. జీవో 58, జీవో 59ని పొడిగించేందుకు ప్రయత్నిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. కేబినెట్ భేటీలో చర్చించి వీటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పేదలు సంతోషంగా ఉండాలన్నదే మా విధానమన్నారు. గతంలో భూ పంపిణీ శాస్త్రీయంగా జరగలేదన్నారు.
జాగా లేకుండా ఇష్టా రాజ్యంగా సర్టిఫికేట్లు ఇచ్చారని చెప్పారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికేట్లు పట్టా సర్టిఫికెట్లు కావన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు ధరణి పోర్టల్ లో ప్రత్యేక కాలమ్ ఉంటుందని తెలిపారు.