తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్ విడుదల.. మామూలుగా లేదుగా.. ఇక కళ్లు చెదిరిపోయేలా డెవలప్మెంట్..
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్లో సెషన్లు ముగిశాయి.
Vision Document: తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్లో సెషన్లు ముగిశాయి. తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్ను విడుదల చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ దార్శనిక పత్రం ఉంది. 83 పేజీలు ఉన్న ఈ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, మెగాస్టార్ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
నీతి ఆయోగ్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఉందని దువ్వూరి సుబ్బారావు చెప్పారు. దేశంలోనే వృద్ధిరేటు అధికంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో డాక్యుమెంట్ను రూపొందించారని ఆనంద్ మహీంద్ర తెలిపారు.
క్యూర్, ప్యూర్, రేర్తో ప్రాంతాల వారీ ప్లాన్తో విజన్ డాక్యుమెంట్ వచ్చిందని తెలంగాణ సర్కారు తెలిపింది. ఫ్యూచర్ సిటీ కేంద్రంగా భారీగా ఉద్యోగాలు వచ్చేలా దాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్కు నాలుగో న్యూక్లియస్గా డెవలప్ చేస్తామన్నారు. 13,500 ఎకరాల్లో గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని వివరించారు.
