అమెరికాలో తెలంగాణ విద్యార్థిని కాల్చి చంపిన దుండగుడు.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

"భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం" అని అన్నారు.

అమెరికాలో తెలంగాణ విద్యార్థిని కాల్చి చంపిన దుండగుడు.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

Updated On : October 4, 2025 / 6:25 PM IST

Telangana Student: అమెరికాలోని డాలస్‌లో తెలంగాణ విద్యార్థి పోలే చంద్రశేఖర్‌ను కాల్చి చంపాడు ఓ దుండగుడు. హైదరాబాద్‌, ఎల్బీనగర్‌ పరిధిలోని బీఎన్‌ రెడ్డి నగర్‌లో అతడి కుటుంబం నివసిస్తోంది. బీడీఎస్‌ పూర్తి చేసిన చంద్రశేఖర్‌ 2023లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు.

శనివారం తెల్లవారుజామున చంద్రశేఖర్‌ ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. బీఎన్‌రెడ్డి నగర్‌లోని అతడి ఫ్యామిలీని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు పరామర్శించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రేవంత్ రెడ్డి ట్వీట్

చంద్రశేఖర్‌ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్‌లో స్పందించారు. “అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఎల్బీ నగర్‌కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించింది.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం” అని అన్నారు.