Mahesh Kumar Goud: కొండా సుస్మిత వ్యాఖ్యలపై సీరియస్.. లైన్ దాటితే చర్యలు తప్పవు.. కొండా సురేఖకు టీపీసీసీ హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీలో ఎంతటి వారైనా పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు.
Tpcc chief mahesh kumar goud warns congress leaders over party discipline
- కొండా సుస్మిత వ్యాఖ్యల ఖండన
- క్రమశిక్షణ దాటితే కఠిన చర్యలు
- వివరణ కోరిన కాంగ్రెస్ నాయకత్వం
Mahesh Kumar Goud: కాంగ్రెస్ పార్టీలో ఎంతటి వారైనా పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సిందేనని, లైన్ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. నిజామాబాద్ వేదికగా మాట్లాడిన ఆయన, కొండ సుష్మిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ నాయకురాలు కొండ సురేఖ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారని గుర్తుచేస్తూ, ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆమెకు వివరణ కోరడం జరిగిందని తెలిపారు. పార్టీ నియమావళిని అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రతిపక్షాల రాద్ధాంతంపై తీవ్ర ధ్వజం:
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరిగినా వెంటనే సరిదిద్దుకుంటామని స్పష్టం చేస్తూ, అధికారుల పొరపాటు వల్ల జరిగిన తప్పిదాన్ని ఇప్పటికే సవరించామని తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే గత 22 రోజులుగా ఈ అంశంపై రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత చిన్నారెడ్డికి కూడా పార్టీ వివరణ కోరిందని వెల్లడించారు. అంతేకాకుండా, సంబంధిత రెవెన్యూ మంత్రి కూడా తన పొరపాటును అంగీకరించారని ఆయన మీడియాకు తెలిపారు.
కాంగ్రెస్ సిద్ధాంతమే పరమావధి:
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలలో వైవిధ్యం ఉన్నప్పటికీ ఎలాంటి వేర్వేరు రంగులకు తావులేదని మహేష్ కుమార్ గౌడ్ నొక్కిచెప్పారు. ఒక్కసారి పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ నాయకత్వం కిందకే వస్తారని, పార్టీ ఛత్రఛాయల్లోనే కొనసాగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నాయకులు ఎవరైనా సరే వ్యక్తిగత అజెండాలను పక్కనపెట్టి పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.
