వ్యాట్ వాత: ఆంధ్రప్రదేశ్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపధ్యమో? లేక ప్రభుత్వం ఆదాయం తగ్గడం వల్లో తెలియదు కాని సామాన్యుడికి వ్యాట్ వాత పెడుతుంది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఖజానా ఖాళీ అయిందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు 31 శాతం వ్యాట్ను 35.20 శాతానికి, లీటర్ డీజిల్పై ఉన్న 22.5 శాతం వ్యాట్ను 27 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జగన్ ప్రభుత్వం నిర్ణయంతో పెట్రోల్పై రూ.2, డీజిల్పై రూ.2 పెరిగినట్లు అయ్యింది. అయితే, వ్యాట్ పై అదనంగా వసూలు చేస్తోన్న రూ. 2ను వసూలు మాత్రం చేయొద్దంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. వ్యాట్తో పాటు అదనంగా వసూలు చేస్తున్న రెండు రూపాయలను పన్నులోనే కలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు కాస్త తగ్గినా కూడా… పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారి ఆ భారాన్ని మోస్తూ వచ్చినట్లే ఇప్పుడు వ్యాట్ ధరలను భరించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటివి ప్రభుత్వ రంగ కంపెనీలు తగ్గిస్తూ వస్తున్న పెట్రో ధరలను ప్రజలకు చక్కగా అందిస్తుంటే, ఏపలో మాత్రం వడ్డనలు తప్పట్లేదని అంటున్నారు.