టీడీపీకి దేవినేని అవినాశ్ గుడ్ బై!

ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని వీడేందుకు తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ మేరకు తన అనుచరులతో సమావేశమైన అవినాష్, వైసీపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దేవినేని అవినాష్ గత కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే తన అనుచరులతో సమావేశమైన అవినాష్.. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశం ఉంది. గుడివాడ నుంచి కొడాలి నానిపై పోటీ చేసి ఓడిపోయిన అవినాష్, కొంత కాలంగా అవినాష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు తనను పట్టించుకోవడం లేదని ఆయన మనస్తాపానికి గురైనట్లుగా కృష్ణా రాజకీయాల్లో మాట్లాడుకుంటున్నారు.
గతంలో కూడా అవినాష్ టీడీపీని వీడుతున్నారంటూ ప్రచారం సాగినా.. ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరబోతుండగా.. ఆయనతో పాటూ ప్రధాన అనుచరుడు కడియాల బుచ్చిబాబు, ఇతరులు పార్టీని వీడే అవకాశం ఉంది.