సచివాలయ ఉద్యోగాలు : సర్టిఫికేట్ వెరిఫికేషన్ షురూ

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం ఐదు జిల్లాల్లో అధికారులు సర్టిఫికేట్లను పరిశీలించారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మొదలు పెట్టగా..మిగిలిన 8 జిల్లాలో సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం నుంచి మొదలు పెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
హాల్ ఠికెట్ నంబర్, జిల్లా ర్యాంకుల వివరాలతో అధికారులు ఆన్ లైన్లో ఉంచుతున్నారు. 19 రకాల ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ లిస్టును తయారు చేసిన ప్రకటించాల్సి ఉంది. అయితే..మంగళవారం రాత్రి జిల్లాల వారీగా, పోస్టుల వారీగా ఉద్యోగాలకు ఎంపికైన వారితో కూడిన 105 షార్ట్ లిస్టులను అందుబాటులో ఉంచారు. రిజర్వేషన్ల ప్రకారం, రోస్టర్ పాయింట్ల ఆధారంగా జాబితాల రూపకల్పన సంక్లిష్టంగా మారడంతో జాబితా వెల్లడి ఆలస్యమౌతోందని తెలుస్తోంది. మొత్తం అనుకునట్లుగా పూర్తయితే..సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలంటూ అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపుతారు.
కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీలు ఈ ప్రక్రియను 24 నుంచి 26 వరకు జరుపుకోవడానికి అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని జిల్లాల్లో అవసరమైతే 27వ తేదీ వరకు కూడా జరిపినా..29వ తేదీకల్లా మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఎంపికైన వారికి అపాయింట్ మెంట్ లెటర్లు అందచేయాలని అధికారులు స్ఫష్టం చేశారు.