రవళికి ఎర్రబెల్లి నివాళి : నిందితుడ్ని వదిలేది లేదు

వరంగల్: రవళి మృతి కేసులో నిందితుడిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. పెట్రోల్ దాడి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి నివాళులర్పించిన ఎర్రబెల్లి… ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్ కూడా దీనిపై సీరియస్ గా ఉన్నారన్న మంత్రి.. ఇలాంటి ఘటనలు పనరావృతం కాకుండా చూస్తామన్నారు. రవళి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పారు.పోస్టుమార్టం అనంతరం రవళి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు గాంధీ ఆస్పత్రి సిబ్బంది. దీంతో ఆమె మృతదేహాన్ని… వరంగల్ జిల్లాలోని సంగెం మండలం రామచంద్రాపురానికి తరలించారు.
కాగా..వరంగల్లో ప్రేమోన్మాది దాడిలో తోపుచర్ల రవళి (20) చికిత్స పొందుతూ మృతిచెందింది. 90 శాతానికి పైగా కాలిన గాయాలతో హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళి ఆరోగ్యం సోమవారం (మార్చి 4) సాయంత్రానికి మరింత విషమించటంతో ప్రాణాలు కోల్పోయింది.హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్న రవళి తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో పై ఫిబ్రవరి 27న అవినాష్ అనే యువకుడు పెట్రోల్ పోసి ఈ కిరాతకానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే.