భార్యా పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

  • Published By: chvmurthy ,Published On : November 22, 2019 / 02:44 AM IST
భార్యా పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

Updated On : November 22, 2019 / 2:44 AM IST

సిధ్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణ సంఘటన జరిగింది..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఇంటిల్లిపాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కరీంనగర్ కు చెందిన చిలుముల లక్ష్మీరాజం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన విమల అనే మహిళను 12 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా భార్య విమలతో లక్ష్మీరాజంకు కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో విమల కూతురు పవిత్ర, కొడుకు జైపాల్ను తీసుకుని తల్లిగారు ఊరైన ఖమ్మంపల్లికి వచ్చింది.  

గురువారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో లక్ష్మిరాజం విమల ఉంటున్న, బావమరిది ఇంటికి వచ్చి వారిని తలుపు తియ్యమని చెప్పాడు. వారు తలుపు తీయగానే లోపలికి వచ్చి తనతో తెచ్చుకున్న పెట్రోల్ ను… నిద్రిస్తున్న వారిపై చల్లి నిప్పంటించి పారారయ్యాడు.  ఈ ఘటనలో భార్య విమల, కూతురు పవిత్ర, కుమారుడు జైపాల్, బావమరిది రాజు, బావమరిది భార్యలకు తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికుల సహాయంతో వారిని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా.. ప్రాధమిక చికిత్స చేసి వీరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు  లక్ష్మీరాజం సొంత ఊరు కరీంనగర్. గత  కొద్ది ఏళ్లుగా భార్య భర్తల మధ్య గొడవ కారణంగా వివాదాలు జరుగుతున్నాయి. భార్య విమలను తరుచు వేధిస్తూ ఉండేవాడు. పెద్దమనుషుల సమక్షంలో  వీరిమధ్య పంచాయతీ కూడా జరిగింది. కానీ లక్ష్మీరాజం ప్రవర్తనలో మార్పు రాకపోవటంలో విమల పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్లింది. గత రాత్రి రెండు గంటల ప్రాంతంలో  లక్ష్మీ రాజం ఈ ఘాతకానికి ఒడి గట్టాడు. సమాచారం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్ధలానికి  చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.