రోజా ఆస్తులు ఇవే: ఇంట్లో 7కార్లు ఉన్నాయట

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్.కే రోజా మరోసారి నగరి నియోజకవర్గం నుండి బరిలో దిగుతుంది. ఈ క్రమంలో సోమవారం(22 మార్చి 2019) నాడు తన నామినేషన్ను దాఖలు చేసింది. ఈ సంధర్భంగా తన పేరిట రూ.7.38 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో రోజా చూపించింది. ఇందులో స్థిరాస్తులు రూ.4కోట్ల 64లక్షల 20వేల 669 ఉండగా.. చరాస్తుల విలువ రూ. 2కోట్ల 74లక్షల 17వేల 761గా నామినేషన్ పత్రాలలో వెల్లడించింది. అలాగే తన పేరు పైన రూ.49లక్షల 85వేల 026 అప్పు ఉన్నట్లు తెలిపింది.
ఇక తన కుటుంబ సభ్యుల్లో కుమార్తె అనూష, కుమారుడు కృష్ణ కౌశిక్ పేరిట చెరొక రూ.50 లక్షల డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్లో రోజా చూపించింది. అలాగే తన దగ్గర రూ.కోటి విలువ చేసే మహీంద్రా, ఫోర్డ్ ఇండీవర్, చావర్లెట్, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్, హూండా స్ల్పెండర్, మహీంద్రా స్కార్పియో కార్లు ఉన్నాయని ఆమె తెలిపింది.
2017-18లో ఆదాయ పన్ను శాఖకు రూ.52లక్షల 63వేల 291 చెల్లించినట్లు ఆమె చూపించింది. అలాగే తన భర్త సెల్వమణి పేరుపై ఎలాంటి స్థిరాస్తులు లేవనీ, రూ.58 లక్షల విలువైన చరాస్తులు మాత్రం ఉన్నట్లు చెప్పింది. అలాగే సెల్వమణి పేరుపై మరో రూ.22 లక్షల అప్పు ఉందని తన నామినేషన్ పత్రాలలో వెల్లడించింది.