మందుబాబులూ.. జాగ్రత్త.. డ్రోన్లు పట్టేస్తాయి
నూతన సంవత్సరం వేడుకలు ఇవాళ(31 డిసెంబర్ 2019) నుంచే జోరుగా సాగుతాయి. మందుబాబుల హడావుడి మాములుగా ఉండదు. రాత్రంతా జాగారమే.. మందు తాగి బైక్లపై రయ్యి రయ్యిమంటూ తిరుగుతూనే ఉంటారు. అయితే అటువంటివారికి, అలాగే వైన్ షాపులు ఉన్నా, పక్కనే పర్మిట్ రూమ్స్ అవకాశం ఉండి కూడా ఎక్కడపడితే అక్కడ సిట్టింగ్ వేసి మందు కొడితే అడ్డంగా బుక్ చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. దూరంగా వెళ్లి ఏ ఫారెస్ట్లోనో.. పోలాల్లోనో.. జనసంచారం లేని ప్రాంతం చూసుకొని చుక్కేసేవారిని పట్టుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు పోలీసులు.
ఈ క్రమంలోనే కరీంనగర్ రూరల్ పోలీసులు పీఎస్ పరిధిలోని దుర్షేడ్ గ్రామ శివారులో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నవారిని పట్టుకోవడానికి డ్రోన్ కెమెరా ఉపయోగించారు. రైలు పట్టాల మీద మందేస్తున్న 10 మందిని గుర్తించి పట్టుకున్నారు. వీరిని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. బీరు బాటిళ్లతో రైలు పట్టాలెక్కిన గ్లాస్మెట్స్… ఏ బెరుకూ లేకుండా పట్టాలపై అటూ ఇటూ కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ మందేస్తుండగా.. పోలీసులు డ్రోన్ కెమెరాలు ఉపయోగించి వారిని పట్టుకున్నారు.
వారిని పట్టుకున్న రీతిలోనే తెలంగాణలో పలు చోట్ల న్యూ ఇయర్ సంధర్భంగా ఈ పద్దతిని అనుసరిస్తున్నారు పోలీసులు. మందుబాబులు జాగ్రత్త మరి.. ఎటువైపు నుంచి డ్రోన్ వస్తుందో? బయట దర్జాగా తాగితే పట్టించేస్తుంది.