బీజేపీ కొత్త ఇంచార్జీలు, తెలుగు నేతలకు కీలక బాధ్యతలు

  • Published By: madhu ,Published On : November 14, 2020 / 07:49 AM IST
బీజేపీ కొత్త ఇంచార్జీలు, తెలుగు నేతలకు కీలక బాధ్యతలు

New BJP incharge : బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు కొత్త ఇంచార్జీలను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్రాల ఇంచార్జీల పేర్లను ప్రకటించారు. ప్రధానంగా బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఆ పార్టీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే… ఏపీ, తెలంగాణకు సమర్ధులను ఇంచార్జీలుగా నియమించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి ఇంచార్జీగా మురళీధరన్‌ను నియమించింది. వి. మురళీధరన్‌ కేరళకు చెందిన నేత, ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఏపీ ప్రస్తుత ఇంచార్జీ సునీల్‌ దియోధర్‌కు సహ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది.

తెలంగాణకు తరుణ్ చుగ్ : –
తెలంగాణపైనా బీజేపీ కొన్నాళ్లుగా ఫోకస్‌ పెంచింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం బీజేపీ మరింత బూస్ట్‌ ఇచ్చింది. అదే ఉత్సాహంతో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కీలకంగా భావిస్తున్న తెలంగాణ పార్టీ బాధ్యతలను తరుణ్‌చుగ్‌కు అప్పగించింది. తరుణ్‌చుగ్‌ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాదు.. బేటీ బచావ్‌, బేటీ పడావ్‌ కార్యక్రమానికి జాతీయ సహ సమన్వయకర్తగానూ కొనసాగుతున్నారు. తరుణ్‌చుగ్‌కు జమ్మూకశ్మీర్‌, లేహ్‌ ఇంచార్జీ బాధ్యతలను కొనసాగిస్తూనే తెలంగాణ బాధ్యతలనూ అప్పగించారు. ఆయన పంజాబ్‌కు చెందిన నేత. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను మరింత సీరియస్‌గా తీసుకుని బరిలోకి కాషాయదళం దిగనుంది. ఇలాంటి సమయంలో కొత్త ఇన్ చార్జి రావడం, అది కూడా జమ్మూకాశ్మీర్ , లేహ్ లాంటి క్రియాశీలకమైన కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్ చార్జిగా ఉన్న తరుణ్ చుగ్‌కు పగ్గాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది.

తెలుగు బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు : –
తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలకూ బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరిని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జీగా నియమించారు. అంతేకాదు.. ఉత్తరప్రదేశ్‌ సహ ఇన్‌చార్జ్‌, అండమాన్‌ నికోబార్‌ ఇన్‌చార్జ్‌గా సత్యకుమార్‌‌ను నియమించింది. కర్నాటక సహ ఇన్‌చార్జ్‌గా డీకే.అరుణకు బాధ్యతలు అప్పగించింది. మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌గా మురళీధరరావును నియమించింది. ఇక తమిళనాడు సహ ఇన్‌చార్జ్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డికి బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.

జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు : –
సెప్టెంబర్ 26న బీజేపీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాల నేతలకు ప్రమోషన్ ఇచ్చింది. పలువురు కొత్త వారికి అందులో చోటు కల్పించింది. తెలంగాణకు చెందిన డీకే అరుణ, ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టింది. డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో పురందేశ్వరికి చోటు కల్పించింది. ఇప్పుడు ఈ ఇద్దరికీ రాష్ట్రాల ఇంచార్జీ బాధ్యతలను అప్పగించింది.