Justice D.Y.Chandrachud : సుప్రీంకోర్టు సీనియర్ జడ్జికి కరోనా.. కొవిడ్పై సుమోటో విచారణ వాయిదా
కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కరోనా పాజిటివ్ గా తేలింది.
Justice D.Y.Chandrachud : కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కరోనా పాజిటివ్ గా తేలింది.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులే కాదు రాజకీయనేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీలు, మంత్రులు కరోనా బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్లో ప్రముఖులు చాలామంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయనతోపాటు సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. కొన్ని రోజుల పాటు కేసుల విచారణలో పాల్గొనకపోవచ్చని సమాచారం. దీంతో దేశంలో కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు సుమోటోగా చేపట్టిన విచారణ వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.
దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ విధానం, ఔషధాలు, ఆక్సిజన్ సరఫరా తదితర అంశాలను సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ జరుపుతోంది. ఇప్పటికే దీనిపై పలుమార్లు విచారించిన ధర్మాసం.. తదుపరి విచారణను గురువారానికి(మే 13,2021) వాయిదా వేసింది. ప్రస్తుతం ఆయనకు కరోనా సోకడంతో ఈ విచారణ మరో తేదీకి వాయిదా పడనున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి కేంద్రం ఇటీవల 218 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. నిపుణులు, శాస్త్రీయ సలహాల ఆధారంగానే వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించామని, దీనిపై న్యాయవ్యవస్థ జోక్యం తగదంది. జస్టిస్ బాబ్డే పదవీ విరమణ తర్వాత ఆయన నేతృత్వంలోని ధర్మాసనం వింటున్నకోవిడ్ కేసులను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి మార్చారు.
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతికి దాదాపు రాష్ట్రాలన్నీ ఆంక్షల బాటపట్టాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన ఆంక్షలతో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివిటీ 10 శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్డౌన్ అవసరమని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సూచించింది. వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ.. మహమ్మారి కట్టడికి ఎన్ని రోజులు లాక్డౌన్ అవసరమనే అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఐసీఎంఆర్ చీఫ్ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.