Telangana: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత..!
తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేశారు. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర భేటీ జరగ్గా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అత్యవసర ప్రాతిపదికన శనివారం మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గం లౌక్డౌన్, నైట్ కర్ఫ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ నేటితో ముగియనుండగా.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కరోనా పరిస్థితులపై సమీక్ష జరిగింది.
లాక్డౌన్ వేళల సడలింపుతోపాటు వివిధ అంశాలపై చర్చ జరగగా.. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, అంతర్జాతీయ సర్వీసులు విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ మొదలైన దగ్గరి నుండి ఇప్పటి వరకు ప్రతిసారి సడలింపులు పెరుగుతూ రాగా ఇక ఇప్పుడు రాష్ట్రంలో కేసులు కూడా చాలా స్వల్పంగానే నమోదవుతున్నాయి.
ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను తొలగించింది. ఆదివారం ఉదయంతో లాక్ డౌన్ ముగియనుండగా అప్పటి నుండి యధావిధిగా ప్రజా కార్యకలాపాలు మొదలు కానున్నాయి. నిజానికి లాక్ డౌన్ తొలగించినా రాత్రి కర్ఫ్యూ కొనసాగే వీలుంటుందని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం అనూహ్యంగా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ తొలగించింది.
లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను ఈమేరకు కేబినెట్ ఆదేశించింది.
లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది.
— Telangana CMO (@TelanganaCMO) June 19, 2021