Bonda Uma: వైసీపీ నేతల కనుసన్నల్లోనే కొత్తజిల్లాల విభజన: బోండా ఉమా
బోండా ఉమా 10టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రాంతీయంగా వైసీపీ నేతల కనుసన్నల్లోనే కొత్త జిల్లాల విభజన జరిగిందని ఆరోపించారు.
Bonda Uma: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని టీడీపీ నేత బోండా ఉమా దుయ్యబట్టారు. శుక్రవారం విజయవాడలో బోండా ఉమా 10టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రాంతీయంగా వైసీపీ నేతల కనుసన్నల్లోనే కొత్త జిల్లాల విభజన జరిగిందని ఆరోపించారు. ప్రజా సమస్యలను, క్యాసినో వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకే జిల్లాల విభజన తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అభిప్రాయ సేకరణ కూడా లేకుండానే జిల్లాల విభజన చేపట్టిన వైసీపీ ప్రభుత్వం.. అసలు ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన చేశారో చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.
Also read: Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”? అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన
కొత్త జిల్లాలకు ప్రజాభిప్రాయం లేకుండానే పేర్లు పెట్టేశారని ధ్వజమెత్తారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లా కు ఎన్టీఆర్ పేరును స్వాగతిస్తున్నామన్న బోండా ఉమా.. విజయవాడకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టి.. ఎన్టీఆర్ జ్ఞాపకాలు ఉన్న తూర్పు కృష్ణాకు ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిఉంటే మొదటి కేబినెట్ లోనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెట్టే నిర్ణయం తీసుకునే వాళ్ళమని ఆయన అన్నారు.
Also read: India – Pak Border: భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్మృతివనం నిర్మిస్తుంటే.. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని పక్కన పెట్టిందని బోండా ఉమా దుయ్యబట్టారు. అదేవిధంగా ఏలూరు జిల్లాకు మహానటుడు ఎస్వీ రంగారావు పేరును, తూర్పుగోదావరి నుంచి ఏర్పాటయ్యే ఏదైనా జిల్లాకు బాలయోగి పేరు పెట్టాల్సిందేనని బోండా ఉమా డిమాండ్ చేశారు.
Also read: TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ హాజరైన డీహెచ్