Boora Narsaiah Goud: టీఆర్ఎస్కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం?
మునుగోడు ఉప ఎన్నికవేళ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్కు పంపారు.
Boora Narsaiah Goud: టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో తన రాజీనామాకు గల కారణాలను వివరించారు.
‘‘2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో ఎన్నో అవమానాలు భరించా. అయినప్పటికీ ప్రజలకు పార్టీ తరఫున అందుబాటులో ఉన్నాను. అయితే, మునుగోడు ఉప ఎన్నిక వేళ పార్టీకి నా అవసరం లేదని తెలిసింది. టీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీతో రాజకీయ బంధానికి దూరమవుతున్నందుకు చింతిస్తున్నా’’ అంటూ నర్సయ్య గౌడ్ తన లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన బూర నర్సయ్య గౌడ్ బీజేపీ అగ్ర నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన 2014 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలుపొందారు.
అయితే, 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు బదులుగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మనస్తాపం చెందిన నర్సయ్య గౌడ్ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.