పనిమనిషికి కరోనా వైరస్: సీఎం ఇంటి చుట్టుపక్కల తిరిగిన రోగులు
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు బెంగళూరులో డాలర్స్ కాలనీలో ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం ఉంటున్న ఇంటి చుట్టు పక్కల తిరిగినట్లుగా అధికారులు గుర్తించారు.
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబితా ప్రభుత్వం విడుదల చేయగా.. అందులో ఎ–59, ఎ–25 నంబర్ కలిగిన వ్యక్తులు సీఎం ఇంటి చుట్టూ తిరగటం అందోళన కలిగిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన పీ–25 రోగి జతతో పాటు వారి ఇంట్లో పాచి పని చేస్తున్న మహిళ (పీ–59)కు వైరస్ సోకినట్లు అధికారులు చెబుతున్నారు.
సీఎం ఇంటికి చుట్టుపక్కల తిరిగిన రోగులు ఇద్దరు నగరంలోని ఒక ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్సలు పొందుతున్నారు. సీఎం నివాసం ఉంటున్న డాలర్స్ కాలనీలో వీరిద్దరూ సంచారించినట్లు తెలుసుకున్న బీబీఎంపీ జాయింట్ కమిషనర్ పల్లవి, బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ శశికుమార్లు పరిస్థితులను పరిశీలించారు.
ఉత్తరకన్నడ జిల్లాకు చెందిన మహిళ డాలర్స్ కాలనీలో నాలుగు ఇళ్లల్లో పాచిపని చేస్తుంటుందని గుర్తించారు. వారి ఇళ్ల ముందు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు వారిని బయటకు రాకుండా పర్యవేక్షిస్తున్నారు.